- రాష్ట్ర అభివృద్ధికి విశ్వాసం వెల్లడి
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) వార్షిక సర్వసభ్య సమావేశం 2025లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐఐ ప్రతినిధులు చంద్రబాబు ని ఘనంగా సన్మానించారు, ఆయన నాయకత్వాన్ని పొగిడారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, “1995లో నేను దావోస్ వెళ్తానంటే ‘వెళ్లొద్దు’ అని చెప్పారు. పారిశ్రామికవేత్తలతో భేటీ అంటే ఓట్లు పోతాయని భయపెట్టారు. అయినా నేను వెళ్ళాను. అప్పటి నుంచే మీరు చేస్తున్న ప్రతీ మంచి పని కోసం నేను ముందుండి నిలిచాను అని అన్నారు. సీఐఐను మొదటి నుండి ప్రోత్సహించానని, ఇప్పుడు కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి సిఐఐ తమ పాత్రను నిబద్ధతతో నిర్వహించాలని కోరారు.
అమరావతి – అత్యుత్తమ నగరంగా మారుస్తాం
“దేవుడు నాకు మరో నగరాన్ని నిర్మించే అవకాశం ఇచ్చారు. అమరావతిని దేశంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దాలన్నది నా లక్ష్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నగర అభివృద్ధిలో ఆయనకు ఉన్న అనుభవం మరోసారి వెలుగులోకి వచ్చింది.
ఇజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుండి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా
“గతంలో ‘ఇజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నాను. ఇప్పుడు ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అంటున్నాను.” అని ఆయన తెలిపారు. విశాఖలో TCS కేంద్రం ప్రారంభమవుతోందని, ఆర్సెల్లార్ మిట్టల్ పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమవుతోందని వెల్లడించారు. అలాగే విశాఖకు గూగుల్ సంస్థ రాబోతోందని తెలిపారు.
ఏపీలో గ్రీన్ ఎనర్జీకి భవిష్యత్
ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో దేశంలోనే ముందు వరుసలో ఉందని పేర్కొంటూ, సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ రంగాల్లో ఏపీకి అపార అవకాశాలున్నాయి. ఇప్పటికే అనేక దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి అని చెప్పారు. ఆధునిక సాంకేతిక రంగాల్లో ముందడుగు వేస్తామని స్పష్టం చేశారు. “క్వాంటం వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల ప్రోత్సాహమే మా తదుపరి లక్ష్యం. ఇది మా అభివృద్ధి స్లోగన్.” అని వెల్లడించారు.
పెట్టుబడులతో పుష్కలమైన ఉద్యోగావకాశాలు
“గత ఏడాదిలో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. వీటి ద్వారా నాలుగున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయన్న అంచనాలు ఉన్నాయిని చెప్పారు. ఇది రాష్ట్ర యువతకు ఆశాకిరణంగా నిలుస్తుందని పేర్కొన్నారు.