- మరో 7 కంపెనీలకు భూముల కేటాయింపు
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన అథారిటీ సమావేశం
రాజధానిలో కొత్తగా ఏడు సంస్థలకు భూకేటాయింపులు చేస్తూ సీఆర్డీఏ అథారిటీ నిర్ణయం తీసుకుంది. గతంలో 64 సంస్థలకు భూముల కేటాయింపులు పూర్తికాగా.. తాజాగా మరో 7 సంస్థలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రాజధానికి సంబంధించి భూ కేటాయింపులు.. టెండర్ల ప్రక్రియపై మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ 47వ అథారిటీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతకుముందు భూ కేటాయింపులకు సంబంధించి పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఎక్సైజ్, గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్కుమార్, సీఆర్డీఏ కమిషనర్ కే కన్నబాబు తదితరులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలతో పాటు అమరావతి పునర్నిర్మాణ పనుల టెండర్లను సీఆర్డీఏ అథారిటీ సమావేశం ఆమోదించింది. ఈ సమావేశాలకు సంబంధించిన వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు.
2014-19 మధ్య కాలంలో అమరావతిలో అర్థంతరంగా నిలిచిన పనులు పూర్తిచేసేందుకు టెండర్లు పిలవాలని సమావేశం తీర్మానించింది. ఇందులో భాగంగా గెజెటెడ్ అధికారుల భవనాలను రూ. 514.41 కోట్లతో పాటు, మరో 194.73 కోట్ల మేర బాహ్య మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులు పూర్తిచేసేందుకు టెండర్లు ఆహ్వానించనున్నారు.
కాగా రూ. 506.67 కోట్లతో 9 టవర్లలో నాన్ గెజెటెడ్ అధికారుల భవనాలు, మరో 12 టవర్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులకు రూ.517.10 కోట్లతో చేపట్టే పనులకు సీఆర్డీఏ అథారిటీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మొత్తం నాలుగు ప్యాకేజీలుగా రూ. 1732.31 కోట్ల అంంచనాతో పనులు ప్రారంభించేందుకు టెండర్లు ఖరారు చేయనున్నారు.
రాజధానిలో 190 ఎంఎల్డీ సామర్ధం గల వాటర్ ట్రీట్మెంట్ నిర్మాణంతో పాటు ఐదేళ్ల పాటు ఆపరేషన్, నిర్వహణకై 560.57 కోట్లతో టెండర్లు పిలిచేందుకు అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అలాగే ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి 494.86 కోట్లతో టెండర్లకు ఆమోదం లభించింది. జాతీయ రహదారులకు అనుసంధానం చేసేలా ఈ -13 రోడ్డును 4.10 కి.మీ మేర 384.78 కోట్లతో, ఈ – 15 రోడ్డును 3.98 కి.మీ మేర 70 కోట్లతో మౌలిక సదుపాయాలతో కలిపి పొడిగించేందుకు అథారిటీ నిర్ణయం తీసుకుంది. ఇక సీడ్ యాక్సిస్ రోడ్డు ఈ-3లో 1.5 కి.మీ మేర ఎలివే-టె-డ్ రోడ్డు నిర్మాణానికి సీఆర్డీ అథారిటీ ఆమోదముద్ర వేసింది.
ఇదిలా ఉండగా మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం మేరకు మరో 7 సంస్థలకు భూములు కేటాయించేందుకు సీఆర్డీఏ అథారిటీ సుముఖత వ్యక్తం చేసింది. భూముల కేటాయింపు వివరాలిలా ఉన్నాయి.
క్వాంటం వ్యాలీ – 50 ఎకరాలు
లా యూనివర్శిటీ – 55 ఎకరాలు
ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ఆఫీసు – 0.78 ఎకరాలు
ఐఆర్ సీటీ-సీ – ఒక ఎకరం
బసవతారకం క్యాన్సర్ ఫౌండేషన్ కు గతంలో కేటాయించిన 15 ఎకరాలకు అదనంగా 6 ఎకరాలు (కళాశాల ఏర్పాటుకు)
కోస్టల్ బ్యాంకు – 0.4 ఎకరాలు
రెడ్ క్రాస్ సొసైటీ – 0.78 ఎకరాలు
గతంలో 2014-19 మధ్య కాలంలో మొత్తం 131 సంస్తలకు భూములు కేటాయించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరిగి ఆయా సంస్థలతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు. ఎవరెవరు ఎప్పుడెప్పుడు సంస్థల ఏర్పాటు పనులు ప్రారంభిస్తారు. ఎంతెంత స్థలం అవసరం అనే దానిపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చర్చించారు.
కొన్ని సంస్థలు తమ కార్యాలయాలు ఏర్పాటును త్వరలోనే ప్రారంభించేందుకు ముందుకు రాగా, మరికొన్ని సంస్థలు ఉపసంహరించుకున్నాయి. దీంతో ఆయా సంస్థలకు భూకేటాయింపులు రద్దు చేసి. కొత్తగా వచ్చిన ప్రతిపాదనలు పరిశీలించి భూకేటాయింపులు చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.
మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపిన వాటికి సీఆర్డీఏ అధారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అథారిటీ సమావేశంలో కొత్తగా ఆరు సంస్థలకు కేటాయింపులు చేశామన్నారు. ఇప్పటివరకు 71 సంస్థలకు వెయ్యెకరాల మేర కేటాయింపులు జరిగినట్లు వివరించారు.