Covid Cases: దేశంలో 3 వేలకు చేరువలో కొవిడ్ కేసులు

ఢిల్లీ : దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 3,000కు చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక కరోనా బారినపడి ఏడుగురు మరణించారు.. దీంతో, ఈ ఏడాది కరోనాబారినపడి మృతిచెందినవారి సంఖ్య 22కి చేరుకుంది..

కేరళలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీలోనూ బాధితులు పెరుగుతున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, కేవలం నాలుగు రోజుల్లోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మే 26న దేశవ్యాప్తంగా 1,010 యాక్టివ్ కేసులు నమోదు కాగా, మే 30 నాటికి ఈ సంఖ్య 2,710కి చేరింది.

రాష్ట్రాల వారీగా చూస్తే, కేరళలో అత్యధికంగా 1,147 యాక్టివ్ కేసులున్నాయి. 424 యాక్టివ్ కేసులతో మహారాష్ట్ర తరువాతి స్థానంలో ఉంది, గత 24 గంటల్లో 40 కేసులు పెరిగాయి. ఢిల్లీలో కూడా గణనీయమైన పెరుగుదల కనిపించింది, 56 కొత్త కేసులువెలుగు చేశాయి.. మరోవైపు, కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య కూడా పెరుగుతున్నట్టు ప్రభుత్వం చెబుతోంది.. గత 24 గంటల్లో 255 మంది రోగులు కోవిడ్‌ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.. జనవరి 1 నుండి కోలుకున్న కేసుల సంఖ్య 1,170గా ఉంది. కేరళ (72), ఢిల్లీ (77), మహారాష్ట్ర (34) ఈ రోజు అత్యధికంగా కోలుకున్నారు.. మొత్తంగా కరోనా కేసులు పెరుగుల మరోసారి కలవరపెడుతోంది.. మే 25వ తేదీ తర్వాత ఏకంగా ఐదు రెట్లు పెరిగాయి కరోనా పాజిటివ్‌ కేసులు..

మొత్తం కేసులలో కేరళలో అత్యధికంగా 1,147 నమోదు కాగా, మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్‌లో 223 కేసులు నమోదయ్యాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఒక్కొక్కటి 148 చొప్పున కేసులు ఉండగా, పశ్చిమ బెంగాల్‌లో 116 మంది కొవిడ్ తో బాధపడుతున్నారు. రాజస్థాన్‌లో 51, ఉత్తరప్రదేశ్‌లో 42, పుదుచ్చేరిలో 25, హర్యానాలో 20 చొప్పున యాక్టివ్ కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 16, తెలంగాణలో 3 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో 10, గోవాలో 7, ఒడిశా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్‌లలో తలా 4 కేసులు నమోదయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్‌లలో 3 చొప్పున, మిజోరాం, అసోంలలో రెండేసి ఇన్ఫెక్షన్లు గుర్తించారు. అండమాన్ నికోబార్, బీహార్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్‌లలో ప్రస్తుతం ఒక్క యాక్టివ్ కేసు కూడా లేకపోవడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *