లిబరేషన్ డే పేరుతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ టారిఫ్లు అమలు కాకుండా యూఎస్ ట్రేడ్ కోర్టు నిలుపుదల చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్ధిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచ దేశాలపై ఆర్ధిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ విచారణ సందర్భంగా భారత్-పాక్ ఉద్రిక్తతల విషయాన్ని ట్రంప్ ప్రభుత్వం ప్రస్తావించగా, దాన్ని కోర్టు అంగీకరించలేదు.
అధ్యక్షుడికి ఉన్న టారిఫ్ అధికారాలను సమర్ధించాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కోర్టును అభ్యర్ధించింది. చట్ట పరంగా ఎదురైన ఈ సవాల్ చైనాతో వాణిజ ్య పరిధిని మార్చేస్తుందని, భారత్-పాక్ మధ్య ఘర్షణలు పెంచుతుందని అధికారులు వాదించారు. టారిఫ్ అధికారంతోనే ఇటీవల భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ సాధించారని కోర్టుకు తెలిపారు. సుంకాలకు సంబంధించి ప్రస్తుతం అనేక దేశాలతో చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకు వచ్చింది. ఈ ఒప్పందాలను ఖరారు చేసేందుకు జులై 7 వరకు గడువు ఉందని, అప్పటి వరకు దీన్ని సున్నితమైన అంశంగా పరిగణించాలని కోర్టును కోరారు. ఈ వాదనలను కోర్టు తిరస్కరించింది. ఈ తీర్పుపై ట్రంప్ ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది.