న్యూఢిల్లీ – భారత్లో 24 కోట్ల మంది ముస్లింలు జీవిస్తున్నారని, ఇది గర్వకారణమన్నారు ఎంపి , ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. భారత్లో ఎంతో మంది ఇస్లామిక్ పండితులు ఉన్నట్లు ఆయన చెప్పారు. తామే ముస్లిం దేశస్థులమని అరబ్ ప్రపంచాన్ని పాకిస్థాన్ తప్పుదోవ పట్టిస్తోందని, ఇండియా ముస్లింలకు వ్యతిరేకమన్న సంకేతాన్ని ఆ దేశం ఇస్తున్నదని ఆరోపించారు. ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న పాకిస్థాన్ను నిలదీసేందుకు భారత ఎంపీల బృందాలు వివిధ దేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. సౌదీ అరేబియాకు వెళ్లిన బృందంలో సభ్యుడిగా ఉన్న ఆయన అక్కడ జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ,
ఇండియాలో 24 కోట్ల మంది ముస్లింలు ఉన్నారని, అత్యుత్తమైన అరబిక్ భాషను మాట్లాడుతారని చెప్పారు. ముస్లిం దేశం కావడం వల్లే పాకిస్థాన్ను ఇండియా వేధిస్తున్నట్లు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అసదుద్దీన్ పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం పాకిస్థాన్ మానుకుంటే దక్షిణాసియాలో స్థిరత్వం నెలకొంటుందని ఆయన హితవు పలికారు.
పాకిస్థాన్ సైనిక శక్తి గురించి ఆ దేశం చేస్తున్న ప్రగల్భాలను కూడా ఒవైసీ తోసిపుచ్చారు. “మే 9న ఏం జరిగింది? వారి తొమ్మిది వైమానిక స్థావరాలు లక్ష్యంగా చేసుకున్నాం. భారత్ తలచుకుంటే ఆ వైమానిక స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేయగలిగేది. కానీ, ‘మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, అలా చేయకండి, మమ్మల్ని ఆ మార్గంలోకి నెట్టకండి’ అని వారికి చెప్పాలనుకున్నాం. తొమ్మిది ఉగ్రవాద సంస్థల ప్రధాన కార్యాలయాలపై దాడులు జరిగాయన్నారు.. అనంతరం ఎదురుదాడికి దిగిన పాక్ సైనిక, వైమానికి, నావికా స్థావరాలపై భారత్ దాడి చేసి ధ్వంసం చేసిందని వెల్లడించారు.. ఈ దాడి జరిగిన 24 గంటలోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ అంటూ కాళ్ల బేరానికి వచ్చిందని గుర్తు చేశారు.. ఇప్పటికైన పాక్ పాలకులు కళ్లు తెరచి ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వకుండా ఉండాలని సూచించారు.. ఉగ్రభూతం వల్ల పాక్ అనేక కష్టాలను కూడా ఎదుర్కొంటున్నదని అన్నారు..