TG | కేసీఆర్ ముందుచూపుతోనే కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణం : హ‌రీశ్ రావు

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందు చూపుతోనే కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మించార‌ని, మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కూలినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని మాజీ నీటి పారుద‌ల శాఖ‌ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు అన్నారు. శ‌నివారం తెలంగాణ భ‌వ‌న్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ను హ‌రీశ్‌రావు ఇచ్చారు. మొత్తంగా ప్రాజెక్టు ద్వారా 20.33 లక్షల ఎకరాలకు నీరందించామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మహారాష్ట్ర అభ్యంతరం చెప్పకుండా చర్చలు జరిపామన్నారు.

రైతు క‌న్నీరు తుడిచే వారిపై అభాండాలా?
రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని, పొలాల‌కు నీళ్లిచ్చి రైతు కన్నీళ్లు తుడిచిన కేసీఆర్‌పై అభాండాలు వేస్తున్నారని హ‌రీశ్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్‌, బీజేపీ కలిసి తెలంగాణ గొంతు పిసికే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు. కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని, తాము చెప్పే విషయాలు నూటికి నూరుపాళ్లు నిజమన్నారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు-వాస్తవాలు’ అనే పేరుతో నేడు తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

కాళేశ్వ‌రం విష‌యంలో కాంగ్రెస్‌, బీజేపీ ఒక్క‌టై…
కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ,బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్ పై నిందలు వేస్తున్నాయని హ‌రీశ్‌రావు విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడిన 45 రోజులకే మహారాష్ట్రకు వెళ్లి చర్చించి ఎటువంటి అభ్యంత‌రాలు చెప్ప‌కుండా ఒప్పించామన్నారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్‌స్టేషన్లు, 21 పంప్‌హౌస్‌లు, 203 కి.మీ సొరంగాలు, 1,531 కి.మీ గ్రావిటీ కాలువలు, 98 కి.మీ ప్రెజర్‌ మెయిన్స్‌, 141 టీఎంసీల స్టోరేజీ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు నీటి ఎత్తిపోతలు, తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీరు ఎత్తిపోసేలా మొదట రూపకల్పన చేశామ‌న్నారు.

కాళేశ్వ‌రం ద్వారా 141 టీఎంసీలు…
ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా కేవలం 11 టీఎంసీల నీటి మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉండేద‌ని, కాళేశ్వరం ద్వారా 141 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా 16 రిజర్వాయర్ల నిర్మాణం జరిగింద‌ని హ‌రీశ్‌రావు అన్నారు. మేడిగడ్డ, అన్నరం, సుందిళ్ల, మేడారం, మల్కపేట, అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బుస్సాపూర్, గంధమల్ల, కొండం చెరువు, భూంపల్లి, మోతె, ధర్మారావుపేట, కాటేవాడి, ముద్దోజివాడి, తిమ్మక్కపల్లి రిజర్వాయర్లలో 141 నీటి నిల్వ సామర్ధ్యం ఉంద‌ని వివ‌రించారు. ఒక్క మల్లన్న సాగర్ లోనే 50 టీఎంసీల నీటి నిల్వ ఉంటుందన్నారు. ఎస్సారెస్పీకి నీళ్లు రానప్పుడు, కడెం నిండకుండా ఎల్లంపల్లికి కూడా నీళ్లు రానపుడు, మేడిగడ్డలో నీళ్లుంటాయ‌ని, ఎక్కడా నీళ్లు లేనపుడు కూడా నీళ్లు లభ్యమయ్యే పాయింట్ మేడిగడ్డ అని అన్నారు. వర్షాలు బాగా కురిసినపుడు ఎస్సారెస్పీ నుంచి మిడ్ మానేరుకు నీళ్లు తెచ్చుకున్నామ‌న్నారు.

కాళేశ్వ‌రం వ‌ల్లే యాసంగిలో పంట‌లు…
కాళేశ్వరం లేకుండా పంటలు పండాయని కాంగ్రెస్‌ చెబుతోంద‌ని, అయితే వాస్త‌వానికి ఈ ప్రాజెక్టు వల్లనే యాసంగిలోనూ పంటలు పండాయ‌ని హ‌రీశ్‌రావు తెలిపారు. కాళేశ్వరం కింద ఒక్క ఎకరా పారలేదని సీఎం రేవంత్ రెడ్డి అంటుండ‌గా, ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే, 50 వేల ఎకరాలు మాత్రమే సాగయింది అంటున్నారని, ఇంకో కాంగ్రెస్ నాయకుడేమో లక్ష ఎకరాలే పారింది అంటున్నారని, ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు, ఒక్కో నాయకుడు ఒక్కో లెక్క చెబుతాడ‌ని చెప్పారు. కాళేశ్వరం నీళ్లతో ఇప్పటి వరకు నేరుగా 98,570 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందిందని ఆయ‌న చెప్పారు.

విభ‌జ‌న స‌మ‌యంలో…
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు గోదావరి జలాల్లో 940 టీఎంసీలు కేటాయించార‌ని, తెలంగాణ గోదావరి జలాలను ఏనాడూ 400 టీఎంసీలకు మించి వాడుకోలేద‌ని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం నాలుగేళ్లలో అనుమతులు కూడా సాధించలేద‌ని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించకుండానే కాలువల తవ్వకం పనులు చేపట్టార‌ని గుర్తు చేశారు. 2007లో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వ్యయాన్ని రూ.17 వేల కోట్లుగా అప్ప‌టి కాంగ్రెస్ నేత‌లు చెప్పార‌ని,. ప్రాజెక్టు ప్రారంభించకముందే 2011నాటికి అంచనా వ్యయాన్ని రూ.40 వేల కోట్లకు పెంచార‌ని గుర్తు చేశారు.

Leave a Reply