TG | కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్… దాన్ని బండకేసి బాదండి.. బండి
కరీంనగర్ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి ఒక్క తప్పు చేయాలని అంటే… ఐఏఎస్ లు మూడు తప్పులు చేస్తున్నారని వ్యాఖ్యానించడం సిగ్గు చేటన్నారు. సీఎంగా ఉంటూ అవినీతిని, తప్పులను నిరోధించాల్సింది పోయి తప్పులు చేయాలని చెప్పడమేంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రే అవినీతి, తప్పులు జరుగుతున్నాయని ఒప్పుకున్నట్లయిందన్నారు. రాష్ట్రంలో మంత్రుల మధ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చిందన్నారు.
కొందరు మంత్రులు సొంత దుకాణాలు ఓపెన్ చేసి ప్రతి పనికి 15శాతం చొప్పున కమీషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి రూ.56 వేల నిరుద్యోగ భ్రుతి, ప్రతి మహిళకు స్కూటీ, తులం బంగారం, ప్రతి ఉద్యోగికి పీఆర్సీ, 4 డీఏలు, రైతులకు రైతు భరోసా, బోనస్, రుణమాఫీ బాకీ పడిందన్నారు. కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్ అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బాకీల కాంగ్రెస్ సర్కార్ ను బండకేసి బాదాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం కరీంనగర్ లోని కొండా సత్య లక్ష్మీ గార్డెన్ లో ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాల్లోని బీజేపీ మండలాధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తో పాటు ఎంపీలు రఘునందన్ రావు, జి.నగేశ్, ఎమ్మెల్యేలు కాటేపల్లి వెంకటరమణారెడ్డి, పాయల శంకర్, పాల్వాయి హరీష్ బాబు మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, బొడిగె శోభ, జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ మేయర్లు సునీల్ రావు, డి.శంకర్, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.