బీబీసీ అధిపతి జాకీ మార్టిన్కు కేంద్రం ఘాటు లేఖ
ఇక బిబిసి కథనాలపై ఓ కన్నువేస్తామని ప్రకటన
న్యూయార్క్ టైమ్స్ సైతం ఇదే రూటు
ఆమెరికా మొట్టికాయాతో సవరణ వార్త ప్రచురణ
న్యూ ఢిల్లీ – పహల్గామ్ ఉగ్ర దాడిపై అంతర్జాతీయ మీడియా పక్షపాతం ప్రదర్శిస్తోందని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.. పాకిస్థాన్కు అనుకూలంగా.. భారత్కు వ్యతిరేకంగా కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇప్పటికే ది న్యూయార్క్ టైమ్స్ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఉగ్ర దాడిని మిలిటెంట్ దాడిగా ప్రపంచానికి పరిచయం చేసింది. ఏప్రిల్ 22న పహల్గామ్లో పట్టపగలు ఉగ్రమూకలు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి 26 మందిని హతమార్చారు. కళ్ల ముందు ఇంత స్పష్టంగా ఘోరం కనిపించింది. ప్రపంచ దేశాలన్ని తీవ్రంగా ఉగ్ర దాడిని ఖండిస్తుంటే.. న్యూయార్క్ టైమ్స్ మాత్రం తప్పుగా కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని అమెరికా విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. దీంతో పత్రిక తప్పును సరిద్దిద్దుకుని మిలిటెంట్ కాదు టెర్రరిస్ట్ దాడి అని సరి చేసింది. తాజాగా బీబీసీ కూడా అదే జాబితాలో చేరింది.
‘కాశ్మీర్లో జరిగిన దాడి తర్వాత పాకిస్థాన్ వీసాలను భారతదేశం రద్దు చేసింది’ అనే శీర్షికతో బీబీసీ కథనం ప్రచురించి.. అందులో పహల్గామ్ దాడిని మిలిటెంట్ దాడిగా పేర్కొంది. ఈ కథనంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడిపై ఇలాంటి పక్షపాత ధోరణి ఏంటి? అని ఇండియా బీబీసీ అధిపతి జాకీ మార్టిన్కు కేంద్రం లేఖ రాసింది. వాస్తవాలేంటో పరిశీలించాలని కోరింది. ఈ మేరకు పహల్గామ్ దాడికి సంబంధించిన వివరాలను భారత విదేశాంగ శాఖ పంపించింది. పహల్గామ్ దాడిపై బీబీసీ ఉద్దేశాలేంటో పరిశీలిస్తున్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.