తమిళనాడు సిఎం స్టాలిన్ కు కెటిఆర్ మద్దతు
డిలిమిటేషన్ పేరుతో నియోజకవర్గాల కుదింపు
ఇదెక్కటి అన్యాయమన్న కెటిఆర్
దేశ నిర్మాణంలో దక్షిణాది రాష్ట్రాలదే ప్రదాన పాత్ర
జీడీపీలో 5.2 శాతం కంటే ఎక్కువ వాటా ఇక్కడ నుంచే…
హైదరాబాద్ – డీలిమిటేషన్పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమర్థించారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారత దేశానికి అన్యాయం జరుగుతుందన్న వ్యాఖ్యలకు మద్దతిచ్చారు. దేశానికి అత్యవసరమైనప్పుడు కుటుంబ్ర నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదని అన్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు. దేశాభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల పాత్రను పరిగణనలోకి తీసుకోకుండా నియోజకవర్గాల పునర్విభజన చేయడం ప్రజాస్వామ్య, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిజంగానే నియోజకవర్గాల పునర్విభన చేయాలని భావిస్తే అది దేశానికి అందించే ఆర్థిక సహకారం వాటా ఆధారంగా ఉండాలని ప్రతిపాదించారు. దేశ నిర్మాణానికి తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న కృషిని ఎవరూ విస్మరించలేరని అన్నారు. దేశ జనాభాలో తెలంగాణ జనాభా కేవలం 2.8 శాతం మాత్రమే ఉందని కానీ దేశ జీడీపీలో మాత్రం 5.2 శాతం కంటే ఎక్కువ వాటా అందిస్తోందని పేర్కొన్నారు.
వాస్తవాలు చెబితే అధికారులపై వేటా…
తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ (అట్లాస్) రిపోర్టుతో వాస్తవాలను బయటపెట్టిన అధికారులపై కక్షకట్టడం ముఖ్యమంత్రి మూర్ఖత్వానికి నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ దార్శనిక పాలనకు, దద్దమ్మ కాంగ్రెస్ పాలనకు ఉన్న స్పష్టమైన తేడా, నాలుగు కోట్ల సమాజం ముందు బట్టబయలు కావడంతో ముఖ్యమంత్రికి మింగుడుపడటం లేదని అన్నారు.
బీఆర్ఎస్ హయాంలో సాధించిన ఘనమైన గతాన్ని తొక్కిపెట్టడం, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడం ఎవరికీ సాధ్యం కాదని ఈ సీఎం గుర్తుపెట్టుకోవాలని కేటీఆర్ స్పష్టం చేశారు.
14 నెలలుగా ప్రధాన ప్రతిపక్షంపై సాగిస్తున్న రాజకీయ కక్ష సాధింపు చాలదన్నట్టు, ఇప్పుడు అధికార యంత్రాంగంపై కూడా వేధింపులకు దిగడానికి సీఎంకు సిగ్గనిపించడం లేదా? అని నిలదీశారు. తలసరి ఆదాయంలో నంబర్ వన్గా ఉన్న రాష్ట్రాన్ని, తలకు మాసిన నిర్ణయాలతో దివాళా తీసే స్థితికి తెచ్చి ఇప్పటికే క్షమించరాని పాపాన్ని మూటగట్టుకున్నారని తెలిపారు. వాస్తవ గణాంకాలను జీర్ణించుకోలేక, తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ఈ చిల్లర చేష్టలు మానుకుంటే మంచిదని హితవు పలికారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో వ్యవసాయ రంగంలో సాధించిన విప్లవం, పారిశ్రామిక రంగంలో పరుగులు పెట్టిన ప్రగతి పథం.. ప్రజల గుండెల్లో శాశ్వతంగా పదిలమని కేటీఆర్ అన్నారు. కేవలం వెబ్సైట్ నుంచి రిపోర్టులను తొలగించినంత మాత్రాన, చేయని తప్పునకు అధికారులపై వేటు వేసినంత మాత్రాన తెలంగాణ పదేళ్ల ముఖచిత్రాన్ని, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన స్వర్ణయుగాన్ని చెరిపేయడం ఈ ముఖ్యమంత్రి వల్లే కాదు ఢిల్లీ పార్టీ ముత్తాతలకు కూడా సాధ్యం కాదని చెప్పారు.