Comments |ఇరాన్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా : నెతన్యాహు

న్యూఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ :ఇరాన్‌పై యుద్ధం మొదలుపెట్టిన సమయంలోనే తాను ఆ దేశానికి ఓ మాట ఇచ్చానని, ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నానని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అణ్వాయుధ దేశంగా ఇరాన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మారనివ్వబోమని చెబుతూనే ఉన్నామని గుర్తు చేశారు. అణ్వాయుధ కేంద్రాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా తాము దాడులు మొదలు పెట్టామని, లక్ష్యం నెరవేరేదాకా ఎట్టి పరిస్థితుల్లోనూ దాడులు ఆపబోమని చెప్పామని తెలిపారు.

తాము మొదలుపెట్టాం.. అమెరికా పూర్తి చేసింది..

తాము మొదలు పెట్టిన పనిని తాజాగా అమెరికా పూర్తిచేసిందని నెతన్యాహు వివరించారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఇజ్రాయెల్ ప్రజల తరఫున తాను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఇరాన్ అణు స్థావరాలపై దాడులు జరిపిన విషయం ట్రంప్ తనకు ఫోన్ చేసి చెప్పారని నెతన్యాహు తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్ కు ధన్యవాదాలు తెలియజేశామని వివరించారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రను మార్చేస్తుందని చెబుతూ నెతన్యాహు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

Leave a Reply