KNL | మెగా డీఎస్సీ నోటిపికేషన్ విడుదల కోరుతూ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి

కర్నూల్ బ్యూరో : తక్షణమే మెగా డీఎస్సీ నోటిపికేషన్ విడుదల చేయాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో బిర్లా కాంపౌండ్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు గురువారం భారీగా ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ అధ్యక్షత వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో మొదటి సంతకం పెట్టి మొదటికే డీఎస్సీ అభ్యర్థులని మోసం చేశారని ఆరోపించారు. పది నెలలు గడిచినా మొదటి సంతకాన్ని అమలు చేసే దిక్కు లేదని, ఇలాంటప్పుడు వారంలో మెగా డీఎస్సీ అని ముఖ్యమంత్రి, త్వరలోనే మెగా డీఎస్సీ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికి పదిసార్లు ప్రకటనలు చేసి నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేశారని తెలిపారు.

అందుకే ఈరోజు కర్నూలు జిల్లాలోని డీఎస్సీ అభ్యర్థులందరూ మోసం చేశారు మమ్మల్ని అంటూ వెంటనే మెగా డీఎస్సీ విడుదల చేయాలంటూ, జిల్లా మొత్తం అభ్యర్థులందరికీ ఒకే పేపర్ ఉండేలాగా పరీక్షలు నిర్వహించాలని, రోజుకో మాట చెప్పి నిరుద్యోగులను మోసం చేయొద్దని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగవలసి వచ్చిందని తెలిపారు. వెంటనే మెగా డీఎస్సీ విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేసినా పట్టించుకోకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్కడికి వెళితే అక్కడే ఆందోళనకు దిగవలసి వస్తుందని హెచ్చరించారు.

డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ మాట్లాడుతూ.. నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన నినాదాలు చేసినా కలెక్టర్ బయటికి రాకపోవడంతో నిరుద్యోగులంతా ఒకసారిగా గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడో పట్టణ సీఐ కలగజేసుకొని డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ బయటికి పిలిచి వినతిపత్రం అందించారు. అయినా సరే నిరుద్యోగులు కలెక్టర్ బయటికి రావాల్సిందే అంటూ మూడు గంటల పాటు కలెక్టర్ గేటు ముందు ఆందోళనకు దిగారు. చివరికి పదిమంది నిరుద్యోగులను కలెక్టర్ ను కల్పిస్తామని పోలీసులు హామీ ఇచ్చి తీసుకెళ్లడంతో నిరుద్యోగులు ఈ ఉద్యమం ఆరంభం మాత్రమే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప నిరుద్యోగ ఉద్యమానికి అండగా ఉంటామని డీఎస్సీ అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శిరీష, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్లా, జిల్లా సహాయ కార్యదర్శి హుస్సేన్ భాష, నిరుద్యోగ నాయకులు చంద్రశేఖర్, వినయ్, జగన్ మోహన్, 500మంది డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *