వెలగపూడి – ఏప్రిల్ తొలివారంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని, కొత్త ఎస్సీ వర్గీకరణ ప్రకారమే పోస్ట్ లను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.. ఉపాధ్యాయ ఉద్యోగాలు 80 శాతం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే భర్తీ చేసామని పేర్కొన్నారు.
నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న 3వ జిల్లా కలెక్టర్ల సమావేశం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో ప్రారంభమైంది. అద ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, “గత ఐదేళ్లలో ఒక వ్యక్తి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. రాష్ట్ర ప్రజలు గత పాలనతో విసిగి మాకు మద్దతు ఇచ్చారు. ప్రజలకు సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధి అందాలి. వచ్చే నెల మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం. ఎస్సీ వర్గీకరణతోనే డీఎస్సీ భర్తీ చేస్తాం. జూన్లో పాఠశాలలు తెరిచేలోపు నియామకాలు పూర్తి కావాలి. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి తీరుతాం. అమరావతి ఓ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. ప్రపంచంలోనే బెస్ట్ మోడల్తో అమరావతిని అభివృద్ధి చేస్తాం”అని చంద్రబాబు పేర్కొన్నారు.
గతంలో పారదర్శకంగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని చెప్పారు. ఇక మెగా డీఎస్సీ పకడ్బందీగా నిర్వహించాలని అధికారులు కోరారు. ఇక జూన్ లో పాఠశాలలు ప్రారంభించేలోగా పోస్టింగులు ఇస్తామని చెప్పారు…
ప్రజలు ఆనందంగా ఉండాలంటే …
ప్రజలు ఆనందంగా ఉండాలంటే సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి అన్నారు.. అభివృద్ది, సంక్షేమం సమతూకంతో ముందుకు నడిపించినప్పుడే రాష్ట్రం అభివృద్ది పయనిస్తందని అన్నారు.. ప్రభుత్వ పధకాలను, కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేది జిల్లా కలెక్టర్లేనని అంటూ వారి పని తీరుపైనే అభివృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు.
కాగా, తొలి రోజు వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్, ల్యాండ్ సర్వే, వేసవిలో నీటి ఎద్దడి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి సరఫరా తదితర అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్, ముఖ్య సమస్యలు, జిల్లాల వారీగా ఆదాయ మార్గాలు, రెవెన్యూ సమస్యలపై తొలి రోజు చర్చించనున్నారు. ఇంతకు ముందు జరిగిన కలెక్టర్ల సమావేశాల్లో చర్చించిన అంశాలపై సాధించిన ప్రగతిపై సమీక్ష చేయనున్నారు.