Collector’s Meet | ఏపీ కోసం ఉపగ్రహం – సొంతంగా ఏర్పాటు చేద్దాం – చంద్ర‌బాబు

వీలైతే మూడు ఉపగ్రహాలు
డ్రోన్​లు, సీసీటీవీ కెమెరాలు, ఐఓటీ పరికరాలు
ఏఐతో అన్నింటినీ అనుసంధానం చేయొచ్చు
రియల్​లైమ్​లో ప్రతి అంశాన్ని మానిటర్​ చేద్దాం
అడ్మినిస్ట్రేషన్​ రిఫార్మ్స్​లో ఏపీ నెంబర్​1
ఇంటింటికీ ఇంటర్నెట్​ సదుపాయం కల్పిద్దాం
అయిదు దశల్లో సమస్యల పరిష్కారం
కలెక్టర్ల సదస్సులు స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు

వెలగపూడి, ఆంధ్రప్రభ : భవిష్యత్​లో రాష్ట్ర అవసరాల కోసం సొంతంగా ఒక ఉపగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నామని సీఎం చంద్రబాబు అన్నారు. కలెక్టర్ల సదస్సులో రెండో రోజు పలు అంశాలపై దిశా నిర్ధేశం చేశారు. అవసరమైతే ఏపీలోని మూడు ప్రాంతాలకు మూడు ఉపగ్రహాల్ని ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. ఉపగ్రహాలకు అనుబంధంగా డ్రోన్‌లు, సీసీటీవీ కెమెరాలు, ఐఓటీ పరికరాలు ఉంటాయని, వాటిని ఏఐతో అనుసంధానిస్తే సమాచార సేకరణతో పాటు ప్రజలకు రియల్‌టైమ్‌లో సేవలందించవచ్చని సూచించారు. ఇక.. ఇసుక అక్రమాలు సహా ప్రతి అంశాన్నీ రియల్‌టైమ్‌లో కనిపెట్టేందుకు ఉపగ్రహం ఉపయోగపడుతుందన్నారు.

ఇంటింటికీ ఇంటర్నెట్​ సదుపాయం..

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఇంట‌ర్నెట్ స‌దుపాయం క‌ల్పించే దిశ‌గా చ‌ర్యలు తీసుకోవాల‌ని సీఎం సూచించారు. పుర‌పాల‌క శాఖ ప‌ట్ణణాల్లో ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీరు అందించే ల‌క్ష్యాన్ని నిర్దేశించుకుందని తెలిపారు. గ్రామాల్లోనూ ఐదు ద‌శ‌ల్లో కార్యక్రమాన్ని పూర్తి చేయాల‌ని సంక‌ల్పించినట్లు వివరించారు. జిల్లాల్లో జ‌రుగుతున్న అన్ని ప్రాజెక్టుల ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని జిల్లా క‌లెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. అది ఎలాంటి ప్రాజెక్టైనా స‌రే అది పెండింగ్​లో ప‌డ‌కుండా పూర్తి చేయాల‌న్నారు.

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో పెద్ద ఎత్తున బ‌కాయిలు..

కలెక్టర్ల స‌ద‌స్సులో పీ4 కార్యక్రమంపై మాట్లాడిన సీఎం చంద్రబాబు వివిధ అంశాలను చర్చించారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగ‌మ‌ని అన్నారు. వారికి న్యాయంగా అందాల్సిన అల‌వెన్స్​లను అందించ‌కుండా గ‌త ప్రభుత్వం ఏకంగా ₹20,637 కోట్లు ఎగ్గొట్టి బ‌కాయిలు పెట్టింద‌న్నారు. తాము మాత్రం ఇబ్బందులున్నా బకాయిలు ఇస్తున్నామని అన్నారు. మిగిలిన వాటిని వెసులుబాటును బ‌ట్టి విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు. ఉద్యోగుల కుటుంబాలూ చేత‌నైనంత‌లో ఒక పేద కుటుంబాన్ని పైకి తీసుకురావ‌డానికి కృషి చేయాల‌ని కోరారు. పీ4 అనేది గేమ్ ఛేంజ‌ర్‌గా మార‌నుంద‌ని పేర్కొన్నారు.

వ‌ల‌స‌లు వెళ్ల‌కుండా న‌రేగా ఉప‌యోగించాలి..

నరేగా ప‌థ‌కంపై అధికారులు ఇచ్చిన ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్‌పై ముఖ్యమంత్రి స్పందించారు. వేస‌వి పూర్తయ్యేలోపు చెక్ డ్యామ్‌ల‌న్నీ రిపేర్లు పూర్తి చేయాల‌ని చెప్పారు. న‌రేగా నిధులు స‌క్రమంగా వినియోగంచుకుని ప‌నులు చేయాల‌న్నారు. అట‌వీశాఖ న‌రేగా ప‌థ‌కం వినియోగించుకుని ప‌చ్చద‌నం పెంపుద‌లకు కృషి చేయాల‌ని కోరారు. వ‌ల‌స‌లు వెళ్లకుండా నిరోధించేలా జిల్లా క‌లెక్టర్లు చ‌ర్యలు తీసుకోవాల‌ని అన్నారు. 2025-2026 ఆర్థిక సంవ‌త్సరంలో న‌రేగా ద్వారా 4000ల కిలోమీట‌ర్ల ర‌హ‌దార్లు నిర్మించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని చెప్పారు. 1.55 ల‌క్షల పంట కుంట‌లు త‌వ్వాల‌ని నిర్ణయించిన‌ట్లు పేర్కొన్నారు. వేసవి ప్రణాళిక సమర్థంగా ఉండాలని చంద్రబాబు వెల్లడించారు.

వ‌డ్డెర‌ల‌కు క్వారీల అప్ప‌గింత‌కు నిర్ణ‌యం..

రాష్ట్రంలో వ‌డ్డెర సామాజిక వ‌ర్గాల‌కు క్వారీలు ఇవ్వాల‌ని సంక‌ల్పించామ‌ని చంద్రబాబు తెలిపారు. అది వాళ్ల కుల వృత్తి కాబ‌ట్టి ఆ సామాజిక వ‌ర్గానికి క్వారీలు ఇస్తే వారి జీవ‌న ప్రమాణాలు పెరుగుతాయ‌ని వివరించారు. ఇప్పటికే గీత కార్మికుల‌కు 10 శాతం మ‌ద్యం దుకాణాలు కేటాయించామ‌ని చెప్పారు. అవి స‌క్రమంగా అమ‌ల‌వుతున్నాయో లేదో అధికారులు ప‌ర్యవేక్షించాల‌న్నారు. స్వర్ణాంధ్ర విజన్‌-2047 లక్ష్య సాధన కలెక్టర్ల సామర్థ్యం, నెట్‌వర్కింగ్, సకాలంలో పనులు జరిగేలా చూసి ఫలితాలు రాబట్టడంపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ఏ పని చేయాలన్నా డబ్బుల్లేవని ప్రభుత్వం వైపు చూడటం సరికాదని సీఎం పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *