AP | సీఐఐ భేటీకి సీఎం చంద్ర‌బాబు.. కడప నుంచి నేరుగా ఢిల్లీకి ప‌య‌నం

మ‌హానాడు (క‌డ‌ప‌), ఆంధ్ర‌ప్ర‌భ : ముఖ్యమంత్రి చంద్రబాబు కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని ముగించుకుని, వరుస కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. మూడు రోజుల మహానాడు గురువారం ముగియనుంది. అనంతరం, ఈ రోజు సాయంత్రమే సీఎం చంద్రబాబు కడప నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలోని తాజ్ హోటల్‌లో జరగనున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) వార్షిక సర్వసభ్య సమావేశానికి (ఏజీఎం) చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ సమావేశం సాయంత్రం జరగనుంది. రేపు రాత్రి ఆయన ఢిల్లీలోనే బస చేస్తారు.

ఒక్క రోజు ముందే పింఛ‌న్ల పంపిణీ..
శనివారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి, నేరుగా రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం సీహెచ్ గునేపల్లి గ్రామానికి వెళ్తారు. ఆ గ్రామంలో నిర్వహించే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తారు. వాస్తవానికి ప్రతినెలా ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేస్తుండగా, ఈసారి జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో, ఒక రోజు ముందుగానే అంటే మే 31వ తేదీనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

గ్రామ‌స్తుల‌తో ముఖాముఖి..
పింఛన్ల పంపిణీ అనంతరం, సీఎం చంద్రబాబు స్థానిక గ్రామస్తులతో ముఖాముఖి సమావేశం కానున్నారు. ఆ తర్వాత, పార్టీ శ్రేణులతో భేటీ అవుతారు. కార్యక్రమాలన్నీ ముగించుకుని, శనివారం సాయంత్రం ముమ్మిడివరం నుంచి విజయవాడకు తిరుగుపయనమవుతారు. సీఎం పర్యటనకు సంబంధించి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *