చైనా : అగ్రరాజ్యం అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. రెండు దేశాలూ పోటాపోటీగా ఒకరిపై ఒకరు సుంకాలు విధించుకుంటున్నాయి. డ్రాగన్పై అమెరికా 145 శాతం ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఇక ట్రంప్ బెదిరింపులకు చైనా సైతం ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. అగ్రరాజ్యంపై ప్రతీకార సుంకాలతో దాడి చేస్తోంది. గతంలో అమెరికా దిగుమతులపై సుంకాలు 84 శాతానికి పెంచిన డ్రాగన్.. ఇప్పుడు మరింత పెంచింది. అమెరికాపై 125 శాతం సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించింది.
గత మార్చి వరకు చైనా వస్తువులపై అమెరికా 10 శాతం సుంకాన్ని విధించింది. ఇటీవల పెంచిన పన్నుతో ఇది 54 శాతానికి చేరుకున్నది. దీనిపై డ్రాగన్ దీటుగా స్పందించింది. ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకం విధించాలని నిర్ణయించింది. దీనిపై ఆగ్రహించిన ట్రంప్ టారిఫ్ల విషయంలో వెనక్కి తగ్గాలంటూ డ్రాగన్కు వార్నింగ్ ఇచ్చారు. మరో 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టారిఫ్లు 104 శాతానికి చేరాయి.
అయినా చైనా వెనక్కి తగ్గలేదు. అమెరికాపై 84 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ట్రంప్ హెచ్చరికలను చైనా పెడచెవిన పెట్టడంతో మళ్లీ అదనపు సుంకాల పోటు తప్పలేదు. చైనా నిర్ణయంతో ట్రంప్ బుధవారం మరో 21 శాతం బాదారు. దీంతో చైనాపై ప్రతీకార సుంకాలు 125 శాతానికి చేరింది. ఇక ఫెంటానిల్ అక్రమ రవాణాలో చైనా పాత్ర ఉందన్న ఆరోపణలకుగాను ప్రత్యేకంగా 20 శాతం సుంకాలు విధించడంతో మొత్తం టారిఫ్లు 145 శాతానికి చేరింది. మొత్తానికి ఈ పరస్పర సుంకాలతో ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం మరింత పెరిగినైట్టెంది.
మరోవైపు అమెరికా సుంకాల యుద్ధమే చేయాలనుకుంటే.. తుదివరకూ తామూ పోరాడతామని చైనా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అమెరికా చర్చలకు రావాలంటే తమ తలుపులు తెరిచే ఉంటాయని వెల్లడించింది. తాము ఘర్షణకు ప్రయత్నించబోమని, ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కోవడానికైనా వెనుకాడబోమని స్పష్టం చేసింది. ‘చైనా వైఖరి స్పష్టంగా, స్థిరంగా ఉంది. కవ్వింపు చర్యలకు భయపడం. అమెరికా మాట్లాడాలనుకుంటే.. మా తలుపులు తెరిచే ఉంటాయి. కానీ పరస్పర గౌరవం, సమానత్వం ఆధారంగా సంభాషణ జరగాలి. చైనాతో డీల్ చేయాలంటే.. ఒత్తిడి, బెదిరింపులు, బ్లాక్మెయిల్ వంటివి పనిచేయవు’ అని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి హి యోంగ్కియాన్ అన్నారు.