న్యూ ఢిల్లీ – రెండు దశల్లో దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఈ మేరకు నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.. వచ్చే ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి తొలి దశ కుల గణన చేపట్టడానికి ప్లాన్ చేస్తుండగా.. 2027 మార్చి 1వ తేదీ నుంచి రెండో దశ కుల గణన చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇక, తొలి దశలో ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, లడాఖ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కుల గణన చేయబోతున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
కాగా, రాబోయే జనాభా గణన, కుల గణనను పారదర్శక పద్ధతిలో నిర్వహిస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. అయితే, దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహించాలనే డిమాండ్ను కాంగ్రెస్, ఇండియా కూటమితో పాటు పలు ప్రాంతీయ పార్టీలు డిమాండ్ చేశాయి. ఇటీవల, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలు కుల గణన సర్వేను నిర్వహించాయి. అయితే, కర్ణాటకలో ఈ సర్వేపై వొక్కలిగ,లింగాయత్ వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ సర్వేలో న్యాయమైన ప్రాతినిధ్యం లేదని వారు ఆరోపించారు. అయితే, వాస్తవానికి ఏప్రిల్ 2020లో ప్రారంభం కావాల్సిన జాతీయ జనాభా గణన కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. అప్పుడు ఈ జనగణన సర్వే చేసి ఉంటే, తుది నివేదిక 2021 నాటికి వెలువడేది.