ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: బుధవారం భారతీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి, దీనికి ప్రధాన కారణం జీఎస్టీ మండలి సమావేశం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న ప్రతికూల సంకేతాలు. జీఎస్టీలో కొత్త సంస్కరణలపై నేడు, రేపు చర్చ జరగనుండటంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాలు మార్కెట్లో ఒడిదుడుకులకు దారితీశాయి.
ఉదయం 9.34 గంటల సమయానికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సెన్సెక్స్ (Sensex – Nifty) 33.34 పాయింట్ల స్వల్ప నష్టంతో 80,126 వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిఫ్టీ 5.9 పాయింట్లు తగ్గి 24,573 వద్ద ఉంది. ఇటీవల కనిష్టానికి పడిపోయిన రూపాయి విలువ నేడు కొద్దిగా కోలుకొని డాలర్తో పోలిస్తే 88.12 వద్ద ఉంది.
నిఫ్టీ సూచీలో టాటా స్టీల్, ఓఎన్జీసీ, టీసీఎస్, సిప్లా, హిందాల్కో వంటి షేర్లు లాభాలను నమోదు చేసుకోగా, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ, శ్రీరామ్ ఫైనాన్స్, ఆసియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. మంగళవారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, నేడు ఆసియా మార్కెట్లు కూడా అదే ట్రెండ్లో పయనిస్తున్నాయి. ఈ అంతర్జాతీయ పరిణామాలు భారతీయ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. మార్కెట్ ఈరోజు ఎలా ముగుస్తుందో చూడాలి.