- నాలుగు పశువులు మృతి
- ఆదిలాబాద్ జిల్లాలో సంఘటన
ఆదిలాబాద్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల పరిధిలోని కోకస్ మన్నూర్ సమీపంలో గురువారం బస్సు బోల్తా పడిన సంఘటనలో 20మందికి గాయాలయ్యాయి. నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ముందున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు, ఆటోలో ప్రయాణిస్తున్న 20మందికి తీవ్ర గాయాలయ్యాయి. రహదారిపై వెళ్తున్న పశువులను తప్పించబోయి ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. అనంతరం బస్సు బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, నాలుగు పశువులు కూడా మృతి చెందాయి. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సు నిర్మల్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.