ఆంధ్రప్రభ బ్యూరో, నంద్యాల : దేశంలోనే ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం (Srisailam) భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానంలోని వాసవి సత్రం సమీపంలో తుపాకీ బుల్లెట్లు, వంకాయ బాంబులు దొరకటం కలకలం రేపింది. ఇవాళ దేవస్థానంకు వచ్చిన భక్తులు రద్దీగా ఉండే వాసవిసత్రం వెనుకభాగంలో డివైడర్ వద్ద తుపాకీ బుల్లెట్లు (Bullets) దొరికాయి.
దీంతో ఒక్కసారిగా భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయాన్నే పుణ్యక్షేత్రంలో పారిశుద్ధ్య సిబ్బంది పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో వాసవి సత్రం సమీపంలో ఉన్న చెట్లపొదల్లో ఒక బ్యాగును పారిశుధ్య కార్మికులు (Sanitation workers) గుర్తించారు. కార్మికులు అందులో ఏముందో అన్న అనుమానంతో పరిశీలించారు. ఆ బ్యాగులో ఒక ఎర్ర జండాలో నాలుగు 9 యమ్.యమ్.బుల్లెట్లు, నాలుగు వంకాయ బాంబులు, నాలుగు ఎస్.ఎల్.ఆర్.బుల్లెట్లు, తుపాకీ పౌచ్ ఉన్నాయి.
దీంతో పారిశుద్ధ్య ర్మికులు అధికారులకు సమాచారం అందించారు. దేవస్థానం అధికారులు స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోకి ఈ వంకాయ బాంబులు, బుల్లెట్లు ఎలా వచ్చాయనే కోణంలో ఆత్మకూరు డీఎస్పీ (Atmakur DSP) రామాంజి నాయక్ ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టినట్టు తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కావటంతో రాష్ట్రం నుండే కాకుండా ఇతర ప్రాంతాల్లో నుంచి కూడా మంత్రులు, వీఐపీలు దైవదర్శనానికి వెళుతూ ఉంటారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.