గొడ్డలితో నరికి చంపిన దుండగులు
వాజేడు, ఏప్రిల్ 9 ఆంధ్రప్రభ : ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త టేకులగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువకుడు వాసం విజయ్ (28) ని గుర్తుతెలియని దుండగులు తలపై గొడ్డలితో మోది దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన వివరాలు తెలుసుకున్న వెంకటాపురం సిఐ బండార్ కుమార్, పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.
అనంతరం కుటుంబ సభ్యుల నుండి వివరాలు సేకరించి విచారణ ప్రారంభించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంతటి దారుణానికి ఒడిగట్టడంతో టేకులగూడెం గ్రామంలో అలజడి మొదలైంది. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హత్యపైన పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.