హైదరాబాద్ – బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది.. ఆ పార్టీ నేతలు గంగుల కమలాకర్, మాజీ విప్ కేపీ వివేకానంద, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మాణిక్ రావు, అనిల్ జాదవ్ అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ, కెసిఆర్ ను మార్చురీకి పంపిస్తానని రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. మాజీ మంత్రి గంగుల మాట్లాడుతూ.. తాను 2009 నుంచి అసెంబ్లీలో ఉన్నానని, వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్రెడ్డి, కేసీఆర్, చంద్రబాబు లాంటి సీఎంలను చూశానని, కానీ రేవంత్ రెడ్డి లాంటి చేతగాని సీఎంను ఎప్పుడూ చూడలేదని అన్నారు. కేసీఆర్ను రేవంత్ రెడ్డి కేవలం మాజీ ముఖ్యమంత్రిగా చూస్తున్నరని, కానీ తాము తెలంగాణ తెచ్చిన గొప్ప వ్యక్తిగా చూస్తున్నామని గంగుల అన్నారు. కేసీఆర్ చావాలని కోరుకుంటావా..? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తనకు తాను తెలంగాణ సీఎంనే అని అనుకుంటే.. పితృ సమానులైన కేసీఆర్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తండ్రి లాంటి కేసీఆర్ చావును ఎవరూ కోరుకోరని, తెలంగాణ సమాజానికి కూడా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని అన్నారు.
గత 15 నెలలుగా రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష అభ్యంతరకరంగా ఉందని సుధీర్రెడ్డి అన్నారు. ఆయన కేసీఆర్ను కేసీఆర్ కుటుంబాన్ని ఎలా తిట్టాలని చూస్తున్నరని అన్నారు. ఇలాంటి భాష మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి పండబెట్టి తొక్కుతానని, లాగులో తొండలు విడుస్తానని గతంలో మాట్లాడారని, ఇప్పుడేమో కేసీఆర్ను మార్చురీకి పంపిస్తా అంటున్నారని, ఇది ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా..? అని ప్రశ్నించారు. కచ్చితంగా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ అసభ్యంగా మాట్లాడుతున్నారని కేపీ వివేకానంద అన్నారు. రేవంత్ రెడ్డి మానసిక స్థితి బాగోలేదని, ఆయనను కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోవడం లేదని, ఆయన ఆరుగురు మంత్రులను నియమించుకోలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కాక కేసీఆర్ కుటుంబాన్ని తిడుతున్నారని అన్నారు. గవర్నర్తో అబద్దాలు చెప్పించారని అన్నారు. రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెట్టారని, బూతులు తిడుతున్నారని విమర్శించారు.
కాళేశ్వరం అనే పవిత్రమైన పేరును సీఎం రేవంత్ రెడ్డి కూలేశ్వరం అంటున్నారని, ఆయన అధికార మదంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి హామీలు ఎగ్గొట్టడంలో, అవినీతి చేయడంలో డైనమిజం ప్రదర్శిస్తున్నారని, అన్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్న సభలో తాము ఎమ్మెల్యేలుగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నామని, తక్షణమే రేవంత్ రెడ్డి కేసీఆర్కు, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.