హైద్రాబాద్ – బీజేపీ అంటే నమ్మకం కాదు.. అమ్మకం..అని ఎద్దేవా చేశారు బిఆర్ ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని తుక్కు కింద తెగనమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవడం అత్యంత దుర్మార్గం. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీసీఐని పునః ప్రారంభిస్తామని మాట ఇచ్చి, ఓట్లు, సీట్లు దండుకుని చివరికి స్క్రాప్ కింద అమ్మేస్తారా? అని ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు.
సీసీఐపైనే కోటి ఆశలు పెట్టుకుని ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న నిరసనలు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? వారి ఆర్థనాదాలు వినిపించడం లేదా? అని ప్రశ్నించారు.ఎంతో విలువైన యంత్ర పరికరాలను పాత ఇనుప సామాన్ల కింద లెక్కకట్టి ఆన్లైన్లో టెండర్లు పిలవడం, సీసీఐ సంస్థ గొంతు కోయడమే..అని కేటీఆర్ విమర్శించారు.
నిర్మాణ రంగంలో సిమెంట్కు ఉన్న డిమాండ్ దృష్ట్యా సీసీఐని ప్రారంభించి కార్మికులను కాపాడాలని బీఆర్ఎస్ పదుల సార్లు కేంద్ర మంత్రులకు మొరపెట్టుకున్నా.. కనికరించకపోవడం ఆదిలాబాద్కు వెన్నుపోటు పొడవడమే 772 ఎకరాల భూమి, 170 ఎకరాల్లో టౌన్షిప్, 48 మిలియన్ లైమ్స్టోన్ నిల్వలతో సకల వనరులున్న సంస్థను అంగడి సరుకుగా మార్చేసిన కేంద్రానికి ఉద్యోగులు, కార్మికుల గోస తగలక మానదు. ఈ అనాలోచిత నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునే దాకా కార్మికులతో కలిసి ఉద్యమిస్తాం. సంస్థ పరిరక్షణ కోసం ఎంతవరకైనా పోరాడుతాం..అని కేటీఆర్ పేర్కొన్నారు.