తెలంగాణ‌కు బీజేపీ, కాంగ్రెస్ శ‌త్రువులే.. : హ‌రీశ్‌

సంగారెడ్డి జిల్లా, ఆంధ్రజ్యోతి : ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi), సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) చోటా భాయ్, బడే భాయ్ అంటూ ఇద్దరిదీ ఒకే తీరని బీఆర్ఎస్ నేత‌, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హ‌రీశ్‌రావు అన్నారు. తెలంగాణ ప్రజలను మోసగించడంలో, దోచుకోవడంలో కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) రెండు పార్టీలు దొందూ దొందేనని ఆరోపించారు. ఒక పార్టీది మోస చరిత్ర, మరొక పార్టీది ద్రోహ చరిత్ర అని ఆక్షేపించారు. ఈ రోజు జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నేతలు హైదరాబాద్‌లో హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు కేసీఆర్, బీఆర్ఎస్ శ్రీరామరక్ష అని ఉద్ఘాటించారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచుతున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో యూరియా కోసం ఏనాడైనా ఇన్ని తిప్పలు పడ్డామా..? అని ప్రశ్నించారు. యూరియా సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందా లేదా..? అని నిలదీశారు. తెలంగాణ రైతులంటే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చిన్న చూపు అని మండిప‌డ్డారు.

అధిక జ‌డ్పీ స్థానాలు మావే!
స్థానిక సంస్థల ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా జడ్పీ స్థానం బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుందని హ‌రీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలే కేంద్రానికి ప్రాధాన్యమని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని దుయ్యబట్టారు. ఆనాడు దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే, తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఎందుకు ఇవ్వలేదని ప్ర‌శ్నించారు. నల్లధనం తెచ్చి రూ.15 లక్షలు ఇస్తానన్న హామీ ఏమైంది..? అని నిల‌దీశారు.

Leave a Reply