వాహనదారులకు బిగ్షాక్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : వాహనదారులు అప్రమత్తంగా లేకపోతే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదముంది. చలాన్ (Challan) పడితే చూద్దాంలే అనుకుంటే కుదరదిక. కేంద్రం ట్రాఫిక్ రూల్స్ (traffic rules) మార్చింది. ఒక వాహనంపై ఐదు లేదా అంతకంటే ఎక్కువ ట్రాఫిక్ చలాన్లు (Traffic Challans) పెండింగ్లో ఉన్నట్లయితే, సంబంధిత రవాణా అధికారులు ఆ డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేయవచ్చు. చలాన్ చెల్లించడానికి ఉన్న గడువును ప్రస్తుతం ఉన్న 90 రోజుల నుండి 45 రోజులకు తగ్గించారు. 45 రోజుల్లోగా చలాన్ చెల్లించకపోతే, అధికారులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది.
ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే..
రహదారులపై నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులను కట్టడి చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు రాష్ట్ర రవాణా శాఖ సిద్ధమవుతోంది. కొత్తగా నియామకమైన 113 మంది ఏఎంవీఐ(అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ల)లతో రాష్ట్రస్థాయిలో టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయనుంది. వీరందరినీ క్షేత్రస్థాయి విధుల్లో వాహనాల తనిఖీలకు ఉపయోగించాలని రవాణాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అదేసమయంలో వాహన తనిఖీల్లో ఆధునిక సాంకేతికతను వాడకానికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ-ఎన్ఫోర్స్మెంట్ పరికరాల వాడకానికి ప్రణాళికలను రూపొందించి ప్రభుత్వానికి పంపించింది. ఇందుకోసం మొత్తంగా రూ.8.4 కోట్ల నిధులు కావాలని ప్రతిపాదనలు చేసింది.