భారత్ సమ్మిట్ సక్సెస్ అంటూ సీఎం ట్వీట్
వంద దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు
వందలాది ఆలోచనలు.. లక్ష్యం ఒక్కటే
ప్రజాస్వామ్యాన్ని ప్రాణం పోయడం
ప్రజల హక్కులలో సమానత్వం చాటడం
ఆసక్తికర ట్వీట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదికగా ఏప్రిల్ 25వ తేదీ నుంచి రెండు రోజుల పాటు జరిగిన ‘భారత్ సమ్మిట్ 2025’ సక్సెస్ అయ్యింది. దాదాపు వంద దేశాల నుంచి 450 మంది విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంపై సీఎం రేవంత్ రెడ్డి తన ఎక్స్ అకౌంట్లో ఆసక్తికర వీడియోను ఆదివారం షేర్ చేశారు. ‘తెలంగాణ వేదికగా వందకు పైగా దేశాలు వందల ఆలోచనల సంఘర్షణలు.. లక్ష్యం ఒక్కటే ప్రపంచ ప్రజాస్వామ్యానికి ప్రాణం పోయడం. ప్రజల హక్కులలో సమానత్వాన్ని చాటడం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిశానిర్దేశంలో అభివృద్ధిలోనే కాదు ప్రజాస్వామ్య పునరుజ్జీవనంలో సైతం ప్రపంచానికి దిక్సూచి తెలంగాణ’ అని సీఎం పేర్కొన్నారు.
సంక్షోభాలను ఎదుర్కొందాం..
ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాల పరిష్కారానికి ఏకమవుతామని సీఎం రేవంత్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థలను మరింత సమర్థంగా తీర్చిదిద్దుతామని ‘భారత్ సమ్మిట్’లో తీర్మానం చేశారు. ఉగ్రవాదాన్ని, దానికి మద్దతు ఇచ్చే దేశాల వైఖరిని భారత్ సమ్మిట్ ఖండించిందని పేర్కొన్నారు.