- ఇప్పటికే 11మంది ఇన్ ఫ్లూయన్సర్లపై కేసు
- తాజాగా 25మంది సినీ నటినటులపై ఎఫ్ఐఆర్
- రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ,
- నిధి అగర్వాల్, మంచు లక్ష్మీలకు పోలీసుల పిలుపు
హైదరాబాద్ : బెట్టింగ్ యాప్ లను ప్రమోషన్ చేస్తున్న వారి పనిపట్టే పనిలో పోలీసులు పడ్డారు.. ఇప్పటి వరకు ఇన్ ఫ్లూయన్సర్లపై పడిన అధికార యంత్రాంగం తాజాగా సినీ సెలబ్రిటీస్ వైపు దృష్టి సారించింది.. ఒక్కక్కరిపై కేసు నమోదు చేసి వారిని విచారణకు పిలుస్తున్నది.. ఇంకా ఎంత మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నాను, వారి నుంచి నిర్వాహకులు ఎంత ఆదాయం సంపాదించారు తదితర .. ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు. హవాలా రూపంలో.. మనీ లాండరింగ్ జరిగిందని తెలియడంతో.. బెట్టింగ్ యాప్స్ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో.. బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వారిలో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పలువురు ఇన్ఫ్లూయెన్సర్ల మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. వారి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలించడంతో పాటు.. టెక్నికల్గానూ వారి లొకేషన్లు గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.
ఇటీవలే పోలీసుల విచారణకు హాజరైన టేస్టీ తేజాను ఇదే అంశంపై ప్రశ్నించారు. యాప్ నిర్వాహకులు ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు, వారి నుంచి ఎలాంటి నజరానా పొందారనే వివరాలు రాబట్టారు పంజాగుట్ట పోలీసులు.
తాజాగా హీరోయిన్లు హీరోలతో పాటు మరికొంతమంది ఇన్ఫ్లూయెన్సర్లపై నిఘా ఉంచారు. ఇదిలా ఉంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన సెలబ్రెటీల పై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మంచు లక్ష్మీ, నిధి అగర్వాల్ సహా 25 మంది సినీ సెలబ్రిటీస్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. వీరిలో రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ పేర్లు కూడా ఉన్నాయి. వీరితోపాటు.. శోభాశెట్టి, అమృత చౌదరి, నాయని పావని, పండు, నేహా పఠాన్, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి, బయ్యా సన్నీయాదవ్, శ్యామల, విష్ణుప్రియ, టేస్టీ తేజ, రీతూ చౌదరిపై కేసు నమోదు చేశారు పోలీసులు.