జన్నారం, మే14 (ఆంధ్రప్రభ): మంచిర్యాల జిల్లా కవ్వాల పులుల అభయారణ్యం సమీపంలోని విద్యుత్ శాఖ సబ్ స్టేషనులోకి రాత్రి వేళల్లో ఎలుగుబంటి వస్తుండడంతో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా బుధవారం తెల్లవారుజామున ఓ ఎలుగుబంటి స్థానిక విద్యుత్ శాఖ సబ్ స్టేషన్ లోకి రావడంతో సబ్ స్టేషనులో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు ఆ ఎలుగుబంటిని చూసి అవాక్కై ఆందోళనకు గురయ్యారు. గత వారం రోజులుగా ఓ ఎలుగుబంటి విద్యుత్ శాఖ సబ్ స్టేషన్, జువ్విగూడ, పైడిపల్లి, జింకల పునరుత్పత్తి కేంద్రం సమీపంలో రోడ్డుకు ఇరువైపులా రాత్రి వేళల్లో, వేకువజామున తిరుగుతుందని, తాము ఆ ఎలుగుబంటిని చూశామని పలువురు ప్రజలు తెలిపారు.
దీంతో సబ్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న విద్యుత్ ఉద్యోగులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ రాత్రులు కాలం గడుపుతూ, ఎప్పుడు తెల్లవారుతుందోనని భయంతో వణికిపోతున్నారు. ఎలుగుబంటి ఎప్పుడు వచ్చి దాడి చేస్తుందేమోనని విద్యుత్ ఉద్యోగులు, ప్రజలు మరింత భయాందోళనకు లోనవుతున్నారు. అభయారణ్యానికి విద్యుత్ సబ్ స్టేషన్, ఆయా గ్రామాలు పక్కనే ఉండడంతో వన్యప్రాణులు రాత్రి, తెల్లవారుజాముల్లో సంచరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయమై స్థానిక అటవీ బీట్ అధికారిణి లాల్బాయిని మధ్యాహ్నం సంప్రదించగా, అడవిలోని వన్నెప్రాణులు రాత్రి సంచరిస్తాయన్నారు. ఈ మార్గం రాత్రి, తెల్లవారుజామున ప్రయాణించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. ముఖ్యంగా ఈ ప్రాంతానికి నడక కోసం వచ్చే ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.