ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణలో ఆదివారం భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవన ద్రోణి, క్యుములోనింబస్ మేఘాల వల్ల రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ, రేపు సైతం రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, నాగర్ కర్నూల్, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం జిల్లాల్లో భారీ వానలు పడతాయని, ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్లో తేలికపాటి నుంచి మెస్తరు వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది. హైదరాబాద్ నగరాన్ని మరోసారి వర్షం ముంచెత్తనుంది. ఆదివారం రాత్రికి కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్మ్యాన్ ఎక్స్ వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉంటుందని తెలిపారు. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పలు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
భాగ్యనగరం అతలాకుతలం..
శనివారం రాత్రి హైదరాబాద్ నగరం(Hyderabad city)లో వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షాని(Rain)కి భాగ్యనగరం అతలాకుతలమైంది. శనివారం రాత్రి 11గంటల వరకు అందిన సమాచారం ప్రకారం నాంపల్లి బేగంబజార్లో 11.7సెం.మీ., చార్మినార్లో 10.6సెం.మీ, ఖైరతాబాద్ (Khairatabad) 9.4సెం.మీ, ఆసిఫ్నగర్ 9.1సెం.మీ, హయత్నగర్లో 9.0సెం.మీ, ముషీరాబాద్లో 8.6సెం.మీ, హిమాయత్నగర్లో 8.5సెం.మీ, అంబర్పేటలో 8.4సెం.మీ, బహదూర్పురలో 7.2సెం.మీ,అమీర్పేటలో 6సెం.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
చెరువులను తలపించిన రోడ్లు
హైదరాబాద్లోనూ వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ఉదయం నుంచి ఎండగ ఉండగా, సాయంత్రం ఒక్కసారిగా వర్షం దచ్చి కొట్టింది. పండుగ కావడంతో బయటకెళ్లిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కడికక్కడ రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఎటూ కదల్లేక పోయారు. వరద ప్రభావిత ప్రాంతాలకు ముందే చేరుకున్న హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ (Hydra, GHMC, Traffic) సిబ్బంది తగిన చర్యలు చేపట్టారు. నీరు ఆగకుండా చర్యలు చేపట్టారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. వర్షం పడిన కొద్ది సమయానికే నాలాల నీరు రోడ్లపైకి చేరింది. దీంతో పలు రహదారులను అధికారులు క్లోజ్ చేశారు. ట్రాఫిక్ అంతరాయం (traffic disruption), వరద నీరు కారణంగా రోడ్ డైవర్షన్ (road diversion) చేశారు.
భారీగా చేరిన వరద నీరు
పలు జిల్లాలోనూ కుండపోత వాన కురిసింది. మెదక్ జిల్లా కాగజ్మద్దుర్లో 7.2 సెంటీమీటర్ల వర్షం పడింది. జోరు వర్షానికి జనం అవస్థలు పడ్డారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణ మండలం గూడూరు దగ్గర ఈదురు గాలులతో కూడిన వర్షానికి రహదారిపై చెట్టు విరిగిపడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సంగంబండ జలాశయానికి (reservoir) భారీగా వరద వచ్చి చేరింది. భద్రాచలంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (heavy rain with lightning) కురిసింది. వీధులు, రహదారులు జలమయం అయ్యాయి. వాహనాలు రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం వద్ద గల అన్నదాన సత్రం ఎదుట రోడ్డుపై మోకాళ్ల లోతు నీరు చేరింది. దీంతో సత్రంలోని టేబుల్లు, పాత్రలు వర్షపు నీటిలో తడిచాయి.