నిజామాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 25 (ఆంధ్రప్రభ) : పిల్లల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు బాల భవన్ ఒక వేదిక అని డీఈఓ అశోక్ అన్నారు. శుక్రవారం నగరంలోని బాల భవన్ లో నిర్వహించిన ప్రత్యేక వేసవి శిక్షణా తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖాధికారి పార్శి అశోక్ హాజరై నటరాజ విగ్రహానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈసందర్భంగా డీఈవో మాట్లాడుతూ… చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు వారి మానసిక ఉల్లాసానికి జిల్లా బాలభవన్ పని చేస్తుందన్నారు. సంవత్సరం పొడువునా పుస్తకాలతో కుస్తీ పడుతున్న పిల్లలకు ఈ శిక్షణ ఆటవిడుపన్నారు. ఈ శిక్షణా తరగతుల్లో ఆటపాటలతో పాటు, సంగీతం, నృత్యం చిత్రలేఖనం, మ్యాజిక్, నీతి కథలు, యోగా, నాటకం, స్కేటింగ్, టైలరింగ్, కర్రసాము మొదలగు 30 రకాల అంశాల్లో వారికి నచ్చిన అంశాల్లో వారు శిక్షణ తీసుకోవచ్చన్నారు.
బాలభవన్ ఇన్చార్జి సూపరింటెండెంట్ మల్లాది ఉమా బాల, రివార్డ్స్ ప్రత్యేక వేసవి శిక్షగా తరగతుల ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న రిటైర్డ్ బాలభవన్ సూపరింటెండెంట్ విఠల్ ప్రభాకర్, బాలభవన్ శిబ్బంది సేవలను డీఈవో అభినందించారు. మెజీషియన్ జాదూ యుగంధర్ రంగనాథ్ చూపీన ఇంద్రజాల అంశాలు విశేషంగా ఉన్నాయని అభినందించారు. ఈ కార్యక్రమంలో బాలభవన్ సిబ్బంది వెంకట లక్ష్మి, పుష్పలత, లక్ష్మణ్, శ్వేత, శ్రీలత, లలిత, నమ్రత, సోనాలి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 680 మంది పిల్లలు పాల్గొనటం అతిపెద్ద సంఖ్య అని డీఈవో ప్రత్యేకంగా అభినందించారు.