దుబాయ్: ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగాల్సిన పాకిస్తాన్-యుఎఇ మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం, మ్యాచ్ రాత్రి 9 గంటలకు (IST) ప్రారంభమవుతుంది.
పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, అతని సహచరులు టాస్కు కేవలం 30 నిమిషాల ముందు మాత్రమే హోటల్ నుండి బయలుదేరడంతో మ్యాచ్ ఆలస్యమైనట్లు తెలిసింది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, మాజీ ఛైర్మన్లు రమీజ్ రాజా, నజమ్ సేథీలతో చర్చలు జరిపిన అనంతరం జట్టును మైదానానికి పంపినట్లు సమాచారం. ఈ విషయంపై పీసీబీ ప్రతినిధి అమీర్ మిర్ మాట్లాడుతూ, “ప్రస్తుతం ఆన్లైన్ మీటింగ్ జరుగుతోంది. మ్యాచ్ను ఒక గంట ఆలస్యం చేశాం. ఛైర్మన్ త్వరలోనే మీడియాతో మాట్లాడతారు,” అని తెలిపారు.
పీసీబీ-ఐసీసీ వివాదం..
ఈ ఆలస్యం పీసీబీ, ఐసీసీ మధ్య జరుగుతున్న వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ముఖ్యంగా, భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్పై పీసీబీ చేసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. యూఏఈ మ్యాచ్కు పైక్రాఫ్ట్ను తొలగించాలని పీసీబీ విజ్ఞప్తి చేసింది కానీ, ఐసీసీ ఆ వినతిని తిరస్కరించింది.
వివాదానికి కారణం..
ఇటీవలి భారత్-పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత ఆటగాళ్లు చేతులు కలుపుకోకపోవడంపై వివాదం మొదలైంది. దీనికి కారణం పైక్రాఫ్ట్ అని పీసీబీ ఆరోపించింది. పైక్రాఫ్ట్, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాను భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో చేతులు కలపవద్దని చెప్పడమే కాకుండా, రెండు జట్ల కెప్టెన్లు టీమ్ షీట్లు మార్చుకోవడాన్ని కూడా అడ్డుకున్నాడని పీసీబీ ఫిర్యాదులో పేర్కొంది.
పీసీబీ ఫిర్యాదులో ప్రధానాంశాలు:
పైక్రాఫ్ట్ చర్యలు ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఆర్టికల్ 2)ని ఉల్లంఘించాయని, ఇది ఆట స్ఫూర్తికి, MCC నిబంధనలకు విరుద్ధమని పీసీబీ తెలిపింది. ఈ ఘటనకు “రాజకీయ రంగు” అద్దారని, ఇది క్రికెట్ ప్రతిష్టను దెబ్బతీసిందని ఆరోపించింది. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం పీసీబీ ఫిర్యాదుపై ఐసీసీ స్పందన కోసం ఎదురుచూస్తోంది. ఈ వివాదాల మధ్య ఆలస్యంగా ప్రారంభమైన పాకిస్తాన్-యూఏఈ మ్యాచ్ ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. భారత్-పాక్ మ్యాచ్కు అంపైర్గా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్ ఈ మ్యాచ్కు మ్యాచ్ రిఫరీగా ఉన్నందువల్లే ఈ వివాదం జరిగిందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఈ మ్యాచ్కు అతను కొనసాగుతాడా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

