నిపుణులైన కార్మికులను తయారు చేయాలి
అమరావతిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్
(విజయవాడ, ఆంధ్రప్రభ) : నిర్మాణ రంగంలో నిర్మాణాలు నాణ్యంగా కట్టాలంటే నైపుణ్యం కలిగిన భవన నిర్మాణ కార్మికులతో పాటు అవసరమైన సిబ్బంది అవసరమని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. హైదరాబాద్ మాదాపూర్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ను ఎంపి కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో గురువారం ఏపీ బిల్డింగ్ అదర్ కనస్ట్రక్షన్ వర్కర్స్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, ఎపి న్యాక్ అధికారులతో కలిసి సందర్శించి ఆ సంస్ద పనితీరును పరిశీలించారు.
న్యాక్ అధికారులు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో ఇంజనీర్ విద్యార్ధులు, నిరుద్యోగులు, భవన నిర్మాణ కార్మికుల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ… అమరావతిలో సీఎం బాబు కి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన వుందని, అది త్వరలోనే కార్యరూపం దాల్చనుందన్నారు.
అమరావతి రాజధాని పనులు రూ.60 వేల కోట్లతో ప్రారంభమయ్యాయనీ, అమరావతి నిర్మాణానికి ఎంతోమంది సివిల్ ఇంజనీర్లు, సివిల్ వర్కర్స్,ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ అవసరం వుందన్నారు. న్యాక్ లో శిక్షణ పొంది నైపుణ్యం సంపాదించిన వర్కర్స్ వుంటే అద్బుతమైన రాజధాని తయారు అవుతుందన్నారు.
కుటుంబ, ఆర్థిక పరిస్థితుల నేపధ్యంలో టెన్త్, ఇంటర్ అంతకంటే తక్కువ చదువుకే పరిమితమైన యువతకు ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా వుంటాయన్నారు. అలాంటి వారికి ప్రయోజనకరంగా వుండేందుకే అమరావతిలో న్యాక్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
నిర్మాణ రంగంలో మెరుగైన అవకాశాలు అందుకునేందుకు చదువు లేని వారి దగ్గర నుంచి సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన యువతకు ఉపాది కల్పించటంలో ఎన్.ఎ.సి వారిధిగా నిలుస్తుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1998లొ సీఎం గా నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని న్యాక్ ప్రారంభించటం జరిగిందన్నారు.
ఇప్పుడు ఈ ఎన్.ఎ.సి లో శిక్షణ పూర్తి చేసిన యువకులు దేశ విదేశాల్లో అవకాశాలు అందుకుంటున్నారన్నారు. న్యాక్ దినదినాభివృద్ది చెంది దేశంలోనే నెంబర్ వన్ ఇన్ స్టిట్యూట్ పేరు సంపాదించుకోవటం రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు గర్వకారణమన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ న్యాక్ ట్రైనింగ్ డైరెక్టర్ శాంతిశ్రీ, తెలంగాణ న్యాక్ సి.టి.టి.ఐ. ఎమ్.రాజిరెడ్డి, ఎపి న్యాక్ రీజనల్ డైరెక్టర్ పి.మురళీధర్, న్యాక్ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.రాజు, తెలంగాణ న్యాక్ ట్రైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎమ్.డి.అన్వర్ బిన్ మహ్మమద్ పాల్గొన్నారు.