AP | అడ‌వి త‌ల్లి బాట‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ శ్రీకారం – ఆదివాసీలకు అండగా ఉంటామంటూ భరోసా..

అడవి తల్లి బాటతో గిరిజన గ్రామాలకు మహర్ధశ
• పెదపాడు గ్రామంలో గిరిజనాభివృద్ధికి శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
• రూ. 2.12 కోట్ల అంచనా వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
• పెదపాడులో గిరిజనులతో ముఖాముఖి
• ఆరు నెలల్లో 12 అభివృద్ది కార్యక్రమాల పూర్తికి హామీ

విశాఖపట్నం… ఆంధ్ర ప్రభ బ్యూరో – గిరిజన గ్రామాల అభివృద్ధికి లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రివ పవన్ కళ్యాణ్ అడవి తల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా, డుంబ్రిగూడ మండల పరిధిలోని పెదపాడు గ్రామంలో తారు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధాన మంత్రి జన్ మన్ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీవీటీజీ గ్రామాల్లో అభివృద్ధికి బాటలు వేస్తూ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా గిరిజన గ్రామాల్లో రహదారులు, డ్రెయిన్లతో పాటు పాఠశాలలు, తాగునీటి సౌకర్యం, ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంతో గిరిజన గ్రామాలకు మహర్ధశ పట్టనుంది. అడవితల్లి బాట కార్యక్రమంలో భాగంగా చాపరాయి నుంచి పెదపాడు వరకు 2.2 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డును రూ. 2.12 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు.


• 12 సమస్యలు.. ఆరు నెలల గడువు
అడవితల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అనంతరం పెదపాడు గ్రామస్తులతో పవన్ కళ్యాణ్ ముఖాముఖీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆ గ్రామానికి చెందిన పాంగి మాధురి (మ్యాగీ) అనే మహిళ సౌకర్యాలు లేక తాము పడుతున్న ఇబ్బందులు గ్రామస్తుల తరఫున పవన్ కళ్యాణ్ కి తెలియజేస్తూ అర్జీ సమర్పించారు. గ్రామానికి ప్రధాన సమస్య అయిన రహదారి నిర్మాణంతోపాటు చాపరాయి గడ్డ వద్ద బ్రిడ్జి నిర్మించాలని కోరారు. వర్షాకాలంలో గడ్డ పొంగితే రెండు, మూడు వారాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయని వాపోయారు. వాటితోపాటు తాగు నీరు, పాఠశాల భవనం నిర్మాణం, గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం, అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనం, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్, రచ్చబండ నిర్మాణంతో పాటు లైబ్రరీ, విలేజ్ హెల్త్ క్లినిక్, సెల్ టవర్ నిర్మించాలంటూ వినతిపత్రం సమర్పించారు.


ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. పెదపాడు గ్రామస్తులు కోరిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామస్తులు కోరిన 12 అభివృద్ధి కార్యక్రమాలను ఆరు నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు గిరిజనుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు స్పష్టం చేశారు. ఓట్లు వేసినా వేయకపోయినా గిరిజనులకు అండగా నిలబడడం మన బాధ్యత అని అడగగానే నిధులు విడుదల చేశారు. పోరాట యాత్ర సమయంలో కురిడి గ్రామానికి కాలినడకన వెళ్లడం వల్ల గిరిజనులు పడుతున్న కష్టం తెలిసిందని.. అప్పుడే గిరిజన గ్రామాల అభివృద్ధికి నా వంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.


• మా దేవుడు.. మా గ్రామానికి వచ్చాడు..
అడవితల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు పెదపాడుకు వచ్చిన పవన్ క కి స్థానిక గిరిజనులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. గ్రామ శివారుకి ఎదురువచ్చిన గిరిజన మహిళలు మా కష్టాలు తీర్చే మా దేవుడు.. మా గ్రామానికి వచ్చాడు అంటూ గిరిజన తెగకు చెందిన కోది భాషలో పాటలు పాడుతూ.. హారతులతో స్వాగతం పలికారు. ప్రకృతి ఒడి నుంచి సేకరించిన పూలతో దండలు చేసి ఆయనకు వేశారు. గ్రామ శివారు నుంచి పెదపాడు మహిళలు సంప్రదాయ థింసా నృత్యంతో గ్రామంలోకి ఆహ్వానించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారితో పాటు కాలనడకన పెదపాడుకు చేరుకున్నారు. అనంతరం శాస్త్రోక్తంగా అడవితల్లి బాట కార్యక్రమంలో భాగంగా రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.


• గిరిజన ఉత్పత్తుల పరిశీలన
గ్రామ పర్యటనలో భాగంగా గిరిపుత్రులు తమ ప్రాంతంలో సేంద్రీయ పద్దతిలో పండించే గిరిజన ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. చింతపండు, పనస, అడ్డకాయ పిక్కలు, శనగకాయలు, చేమగడ్డలు, జీడి పిక్కలతో పాటు చిరు, కాఫీ గింజలను పరిశీలించారు.


• గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహార కిట్ల పంపిణీ
పెదపాడు గ్రామ పర్యటనలో భాగంగా అద్దె ఇంట్లో నిర్వహిస్తున్న మినీ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో చదువుకుంటున్న చిన్నారులతో ముచ్చటించి వారికి పుస్తకాలు, స్వీట్లు పంచారు. మినీ అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉన్న గర్భిణులు, బాలింతలకు గుడ్లు, పాలు, రాగిపిండి, వేరుశనగ చిక్కీ, బాలామృతం, ఎండు ఖర్జూరంతో కూడిన పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులతో కలసి మొక్కలు నాటారు.


• కురుడి గ్రామస్తుల కృతజ్ఞతలు
ప్రజా పోరాటయాత్ర సమయంలో తమ గ్రామానికి వచ్చి సమస్యలు తెలుసుకోవడంతో పాటు అధికారంలోకి వచ్చిన వెంటనే గుర్తు పెట్టుకుని మరీ సమస్యలు పరిష్కారానికి కృషి చేసిన పవన్ ని కురిడి గ్రామస్తులు కలిసి.. ధన్యవాదాలు తెలియజేశారు. పోరాట యాత్రలో పవన్దృ ష్టికి సమస్యలు తీసుకువచ్చిన గిరిజన మహిళ శ్రీమతి రాములమ్మను చూడగానే గుర్తుపట్టి ఆప్యాయంగా పలుకరించి హత్తుకున్నారు. ఇన్నేళ్లు గడచినా తమను గుర్తు పెట్టుకుని ఆప్యాయంగా పలుకరించడంతో కురిడీ గ్రామస్తులు భావోద్వేగానికి గురయ్యారు.

పోరాట యాత్ర సమయంలో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్న ట్టిబాబు అనే యువకుడు పవన్ కళ్యాణ్ ని కలవగా తన వంతు ప్రోత్సాహం అందించారు. సోమవారం పెదపాడు గ్రామంలో పవన్ కళ్యాణ్ ని చిట్టిబాబు కలిసి ఇటీవల థాయ్ ల్యాండ్ వేదికగా జరిగిన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో తానుసాధించిన విజయాలను ఆయనకు వివరించారు.


• చాపరాయి గెడ్డలో నడుస్తూ.. సమస్యలు వింటూ..
పెదపాడు నుంచి తిరుగు ప్రయాణంలో పోతంగి గ్రామ పంచాయతీ పరిధిలోని 8 గ్రామాల ప్రజలు వన్ కళ్యాణ్ ని కలిసి సమస్యలపై అర్జీ ఇచ్చారు. చంపపట్టి గెడ్డ మీద ఉన్న బ్రిడ్జి హుదూద్ తుపాన్ సమయంలో ధ్వంసం అయ్యిందని, ఇప్పటి వరకు పునర్నిర్మాణం చేపట్టలేదని చెప్పారు. గెడ్డ పొంగినప్పుడు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయని, గర్భిణులు, ఆనారోగ్య పీడితులను అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులతో పాటు చాపరాయిలో నడుస్తూ ఆయా గ్రామాల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జి నిర్మాణం ప్రక్రియ తక్షణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.


అడ్డాకుల టోపీ ధరించి.. కోది భాషలో ప్రసంగించి…


గిరిజన గ్రామాలను అభివృద్ధి బాట పట్టించేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటకు వచ్చిన పవన్ కళ్యాణ్ ద్యంతం అడవి బిడ్డలతో మమేకం అయ్యారు. గిరిజన సంప్రదాయ కోదీ భాషలో పెదపాడు గ్రామస్తులు స్వాగత సత్కారాలు చేయగా, పవన్ కళ్యాణ్ కూడా కోదీ భాష తెలుసుకుని.. అదే భాషలో ప్రసంగించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. కోదీ భాషలోనే పెదపాడు, కురిడీ గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. కోదీ భాషలోనే వారు తన ఎదుట ఉంచిన 12 సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు మండుటెండలో తనకు స్వాగతం పలికేందుకు వచ్చి.. తనతోపాటు నడిచిన అలసిన గిరిజన మహిళలకు వాహన శ్రేణి నుంచి తాగునీటి సీసాలు తెప్పించి స్వయంగా అందజేశారు. పెదపాడుకు చెందిన గిరిజనుడు అడ్డాకులతో స్వయంగా కుట్టిన టోపీని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలంకరించారు.


ఈ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో విద్యాబోధన తీరుని పరిశీలించారు. త్వరలో నూతన పాఠశాల నిర్మిస్తానని హామీ ఇచ్చి వారికి తమాషా పిట్టకథల పుస్తకాలు, స్వీట్లు పంచారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణ తేజ, అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ శ్రీ అమిత్ బర్దార్, అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ శ్రీ బాలా నాయక్, జాయింట్ కలెక్టర్ శ్రీ అభిషేక్ గౌడ, ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్ శ్రీ దొన్ను దొర, జనసేన నాయకులు శ్రీ వంపూరు గంగులయ్య, శ్రీ చెట్టి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply