- ధూమ్ ధామ్ గా ప్రారంభ వేడుకలు
మచిలీపట్నంలో నిర్వహించిన మసులా బీచ్ ఫెస్ట్ ప్రారంభ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ‘ఇది మన ఊరు.. మన పండుగ’ నినాదంతో మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో నాలుగు రోజులపాటు నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్లో భాగంగా తొలిరోజైనా గురువారం నిర్వహించిన నేషనల్ వాటర్ స్పోర్ట్స్ ను మంత్రులు కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రారంభించారు.
శుక్రవారం నుండి మూడు రోజుల పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద ఈవెంట్గా మసులా బీచ్ ఫెస్టివల్ ఉండనుంది. ఎమ్యూజ్మెంట్, ఎంటర్టైన్మెంట్, అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. హెలీ రైడ్, పారా గ్లైడింగ్, స్పీడ్ బోట్, జెట్ స్కీ, బంగీ లాంటి క్రీడలను కూడా ఏర్పాటు చేశారు.
శుక్రవారం సాయంత్రం నుండి తెలుగు సినీ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలుగు వారి రుచులు, ప్రత్యేకంగా బందరు రుచులు, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేసే లక్ష్యంతో సుమారు 100కి పైగా ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేశారు.
అలాగే భారతదేశంలో ప్రత్యేకమైన రుచులతో కూడిన ఆహార పదార్థాలతో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు, ఫెస్టివల్ కు వచ్చే పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నేతృత్వంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ధూమ్ ధామ్ గా ప్రారంభ వేడుకలు…
గురువారం సాయంత్రం జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ, ఆహ్వానపు బీచ్ వాలీబాల్, వాటర్ స్పోర్ట్స్ ను మంత్రులు అట్టహసంగా ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో క్రీడాకారులు చేసిన మార్చ్ ఫాస్ట్ అలరించింది. శుక్రవారం సాయంత్రం నుండి మ్యాచ్ లు ప్లడ్ లైట్ల వెలుగులో జరుగనున్నాయి. వివిధ రాష్ట్రాల నుండి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు చేరుకున్నారు.