కృష్ణా బ్యూరో ఆంధ్రప్రభ – మచిలీపట్నం పోర్ట్ నిర్మాణాన్ని వేగవంతంగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దీనిలో భాగంగా పోర్టు నిర్మాణంపై ప్రతి నెలా మారిటైమ్ బోర్డు సమీక్ష చేస్తోoదని రహదారులు భవనాల మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ కొల్లు రవీంద్ర తెలిపారు. మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఆర్టీసీ సంస్థ చైర్మన్ కొనకళ్ల నారాయణ ,జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి మచిలీపట్నం పోర్ట్ నిర్మాణ పనులను మంత్రులు సోమవారం పరిశీలించారు. మెగా ఇంజినీరింగ్ సంస్థ జనరల్ మేనేజర్ జి. తులసీదాస్ పోర్టు నిర్మాణ పనుల పురోగతిని మంత్రులకు, అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా ప్రతినెలా పోర్ట్ ను సoదర్శించి పనులు వేగవంతంగా చేసేందుకు చర్యలు తీసుకోవాలని మారిటైమ్ బోర్డు చీఫ్ ఇంజినీర్ జీవి రాఘవరావుని మంత్రి జనార్ధనరెడ్డి ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్ధనరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికీ పోర్ట్ పనులు 35 శాతం పూర్తయ్యాయని చెప్పారు. 2025 అక్టోబర్ కు పోర్ట్ నిర్మాణాన్ని కాంట్రాక్టు సంస్థ పూర్తి చేయాల్సి ఉందన్నారు . కాంట్రాక్ట్ సంస్థ 2026 నవంబర్ వరకు గడువు కోరుతోందని, జూన్ నెలకు 2026 మధ్యoతరానికి పూర్తి చేయాలని సూచించామన్నారు. పోర్టుకు అనుసంధానంగా జాతీయ రహదారులు, రైల్వే లైన్లను ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రాజధాని అమరావతికి మచిలీపట్నం పోర్ట్ గేట్ వే ఆఫ్ అమరావతిగా నిలుస్తుందన్నారు
మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ టీడీపీ పోరాట ఫలితంగానే మచిలీపట్నం పోర్ట్ నిర్మాణం జరుగుతోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పోర్టు నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందని అన్నారు. పోర్టు నిర్మాణంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు . పోర్టు తో పాటు అనుబంధ పరిశ్రమల నిర్మాణానికి భూములు అందుబాటులో ఉన్నాయని అన్నారు. పోర్టు నిర్మాణంతో ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అనంతరం మంత్రులు అధికారులు, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు పరిశీలించారు.