అమరావతి : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ‘సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఈ విస్తృతస్థాయి భేటీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ పరిశీలకులకు స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు.
సమావేశానికి 15 మంది ఎమ్మెల్యేలు, 56 మంది ఆహ్వానితులు హాజరుకాకపోవడంపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “సమావేశాలకే రానివారు ప్రజల కోసం ఏం చేస్తారు? ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్తు ఉంటుంది,” అని హెచ్చరించారు.
“ఉదయం ఎవరు వచ్చారు, సంతకాలు పెట్టి ఎవరు వెళ్లిపోయారు, చివరి వరకూ ఎవరు ఉన్నారు అన్న లెక్కలు అన్నీ నా వద్ద ఉన్నాయి. పని చేయకుండా సలహాలే ఇచ్చేవాళ్లకు భవిష్యత్తు లేదంటూ” ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు.
ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్తు…
ఎన్నికలు ఉన్నప్పుడు కాదు.. ఇప్పటినుంచే ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా పనిచేయాలి. పాజిటివ్ పాలిటిక్స్, క్లీన్ పాలిటిక్స్ చేస్తేనే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తామని స్పష్టం చేశారు.
“ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. చేసిన మేలు ప్రజలకు చెప్పుకోవాలి. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరించాలి,” అని చంద్రబాబు గట్టి సందేశం ఇచ్చారు. లోటు బడ్జెట్తో ఏర్పడిన కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో నెంబర్ వన్గా నిలిపాం. ఏడాది క్రితం విధ్వంస పాలనతో రాష్ట్రం గందరగోళంగా మారింది. కేంద్ర నిధులు మళ్లించబడ్డాయి. తెలుగుదేశం మాత్రం బాధ్యతగా వ్యవహరించిందన్నారు. “దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లభించని అవకాశాలు తెలుగుదేశానికి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటు విషయంలో కీలక పాత్ర పోషించాం అని గుర్తు చేశారు.
ఇంటింటి ప్రచారానికి సిద్ధం కావాలి…
ఈ సమావేశంలో మేనిఫెస్టో అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. జులై 2 నుంచి ఇంటింటి ప్రచారం ప్రారంభం అవుతుంది. ఏడాది పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ నేతలు సమన్వయంతో ప్రచారం చేయాలి. కూటమి భాగస్వాములందరూ కలిసి పనిచేయాలి సీఎం స్పష్టంగా చెప్పారు.
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆగస్టు 15 నాటికి 700కి పైగా పౌరసేవలు అందుబాటులోకి తెస్తాం. ఇకపై సేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.
సంక్షేమం – అభివృద్ధిపై స్పష్టత…
భారతదేశంలో అత్యధికంగా పింఛను ఇచ్చేది మనమే. ఒక్కటో తేదీనే జీతాలు ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. తల్లికి వందనం వంటి అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నాం. ఇది సూపరిపాలనకు తొలి అడుగని వివరించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శ్రీకారం చుట్టాం. ఈ ఏడాదే అనకాపల్లికి నీళ్లు పంపుతున్నాం. తర్వాత వంశధారకు అనుసంధానం చేస్తాం అన్నారు. ప్రతి ఇంటికి సౌర విద్యుత్తు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా అందిస్తున్నాం. బీసీలకు రూ.98 వేల వరకు, ఓసీలకు రూ.70 వేల వరకు సబ్సిడీ అందిస్తున్నాం అని తెలిపారు.
ఈ సమావేశం ద్వారా చంద్రబాబు చాలా మందికి గట్టిగానే హెచ్చరిక ఇచ్చినట్టే కనిపిస్తోంది. మిషన్ 2029 దృష్టిలో ఉంచుకుని ప్రతి నేత క్షేత్రస్థాయిలో పనిచేయాలని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇకపై పార్టీ నిర్లక్ష్యాన్ని సహించబోమన్న ఆయన వైఖరి స్పష్టంగా వెల్లడైంది.