వెలగపూడి – ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి.. ఇంటర్ ఫస్టియర్లో 70 శాతం ఉత్తీర్ణత కాగా,.. సెకండియర్లో 83 శాతం ఉత్తీర్ణత సాధించారు విద్యార్థులు.. ఫలితాలలో బాలికలే దుమ్ముదులిపేశారు.. ఫస్ట్టీయర్ లో 75 శాతం మంది బాలికలు పాస్ కాగా, బాలుర శాతం 66 గా మాత్రమే ఉంది. ఇక సెకండీయర్ లో ఏకంగా 86 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించగా బాలురు మాత్రం 80 శాతానికి పరిమితమయ్యారు..
ఇంటర్ రెగ్యులర్ ఫస్టియర్ పరీక్షలకు 4,87,295 మంది విద్యార్థులు, ఇంటర్ రెగ్యులర్ సెకండియర్ పరీక్షలకు 4,22,030 మంది విద్యార్థులు హాజరు కాగా.. మొత్తం రెగ్యులర్ విద్యార్థుల సంఖ్య 9,09,325గా ఉంది.. ఒకేషనల్ విద్యార్థులు ఫస్టియర్లో 38,553 మంది, సెకండియర్లో 33,289 మంది కలిపి మొత్తం 71,842 మంది విద్యార్థులు హాజరయ్యారు.. ఇక, ప్రైవేట్గా పరీక్షలు రాసిన విద్యార్థులు 35,935 మంది.. మొత్తంగా ఇంటర్ ఫస్టియర్లో 5,25,848 మంది, సెకండియర్లో 4,91,254 మంది విద్యార్థులు కలుపుకొని 10,17,102 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు అయ్యారు..
ఇక రెగ్యులర్ ఇంటర్ 3,51,521 మంది అంటే 83 శాతం మంది.. ఫస్టియర్లో 3,42,979 మంది అంటే 70 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.. ఒకేషన్ ఫస్టియర్లో 77 శాతం, సెకండియర్లో 62 శాతం ఉత్తీర్ణులయ్యారు.. ఇక, రెగ్యులర్ ఇంటర్ సెకండియర్లో బాలుర ఉత్తీర్ణత శాతం 80 శాతంగా ఉంటే.. బాలికలు 86 శాతంతో పై చేయి సాధించారు.. ఇంటర్ ఫస్టియర్లోలో బాలురు 66 శాతం ఉత్తీర్ణులైతే.. బాలికలో 75 శాతంతో ముందు వరుసలో నిలిచారు.. ఒకేషన్ సెకండియర్లో బాలురు 67 శాతం, బాలికలు 84 శాతం.. ఫస్టియర్లో బాలురు 50 శాతం, బాలికలు 71 శాతం పాస్ అయ్యారు..
కృష్ణా జిల్లా టాప్ .. అల్లూరి జిల్లా లీస్ట్ …
మరోవైపు ఇంటర్ ఫలితాల్లో 93 శాతం ఉత్తీర్ణతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. గుంటూరు 91 శాతంలో రెండో స్థానంలో.. ఎన్టీఆర్ జిల్లా 89 శాతంతో మూడో స్థానంలో.. తూర్పు గోదావరి, నెల్లూరు, విశాఖపట్నం 87 శాతం ఉత్తీర్ణత సాధించగా.. 73 శాతం ఉత్తీర్ణతతో అల్లూరి సీతారామ రాజు జిల్లా.. అనకాపల్లి చివరి స్థానంలో నిలిచాయి.. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 85 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిస్తే.. వరుసగా 82 శాతం, 81 శాతం, 79 శాతంలో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా, విశాఖపట్నం నిలిచాయి.. ఇక, 54 శాతం ఉత్తీర్ణతతో చిత్తూరు జిల్లా అట్టడుగు స్థానానికి పరిమితమైంది..
నిరాశ వద్దు – నారా లోకేష్
ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో గత పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైనందుకు ఆనందంగా ఉంది అన్నారు మంత్రి నారా లోకేష్. మొదటి సంవత్సరం విద్యార్థులకు 70 శాతం మరియు రెండో సంవత్సరం విద్యార్థులకు 83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ , యు ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలలో మెరుగుదల ప్రత్యేకంగా కనిపించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల (GJCs) లో రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం 69 శాతంగా నమోదు కాగా, ఇది గత 10 ఏళ్లలో అత్యధికం. మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 47 శాతంగా ఉంది, ఇది గత పదేళ్లలో రెండవ అత్యధిక శాతం. ఈ విజయానికి విద్యార్థులు, జూనియర్ అధ్యాపకులు , విద్యా పురోగతికి కృషి చేసిన ప్రతి ఒక్కరి కఠినమైన శ్రమే కారణంగా పేర్కొన్నారు లోకేష్ ..
ఈసారి ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు నిరాశ చెందవద్దన్నారు. దీనిని ఒక అడుగుగా భావించి, మరింత కృషి చేసి, మరింత బలంగా తిరిగి రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. ప్రతి విద్యార్థికి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మీరు నిరంతరం నేర్చుకుంటూ, ఎదుగుతూ, విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
రీకౌంటింగ్కు అవకాశం..
కాగా, రిజల్ట్స్లో తేడా ఉంటే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన తేదీలను ప్రకటించారు. ఈనెల 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ఫెయిలైన విద్యార్థుల కోసం థియరీ సప్లిమెంటరీ పరీక్షలను వచ్చే నెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ సప్లిమెంటరీ పరీక్షలను వచ్చే నెల 28వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు జిల్లా కేంద్రాలలో మాత్రమే నిర్వహిస్తామని ప్రకటించారు. సప్లిమెంటరీ పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులు ఈ నెల 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పరీక్ష ఫీజును చెల్లించాలని సూచించారు.