వెలగపూడి : ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కుఎపి మంత్రి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నిర్మాణ పనులను ఎల్1 బిడ్డర్కు అప్పగించాలని నిర్ణయించింది. స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది. పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు నిర్వహించిన ఏపీ కేబినెట్ భేటిలో మొత్తం 24 అంశాలపై మంత్రులు చర్చించారు.. వాటిలో కొన్నింటికి ఆమోద ముద్ర లభించగా, మరికొన్నింటిపై మరోసారి చర్చించాలని నిర్ణయించారు. జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి వచ్చిన ఎస్సీ వర్గీకరణ నివేదికపై మంత్రివర్గంలో కీలక చర్చ జరిపారు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను శాసనసభలో ఆమోదించి జాతీయ ఎస్సీ కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. జాతీయ ఎస్సీ కమిషన్ పరిశీలన తర్వాత తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక వచ్చింది. దీనిని సూత్రప్రాయంగా ఆమోదించింది కేబినేట్. ఇక దీనిపై ఆర్డినెన్స్ జారీ చేయాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది.
అలాగే మంత్రి వర్గం సీఆర్డిఏ 46 ఆధారిటీ నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవనాల టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎల్వన్గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ. 617 కోట్లతో అసెంబ్లీ బేస్ మెంట్ + జీ + 3 + వ్యూయింగ్ ప్లాట్ ఫాంలు + పనోరమిక్ వ్యూ (బిల్టప్ ఏరియా 11.22 లక్షల చదరపు అడుగులు,ఎత్తు 250 మీటర్లు) అసెంబ్లీ నిర్మాణానికి టెండర్లలో ఎల్వన్గా నిలిచిన సంస్థకు ఎల్ఓఏ (LOA) ఇవ్వాలని కేబినేట్ నిర్ణయించింది.. రూ.786 కోట్లతో హైకోర్టు బేస్ మెంట్ + జీ + 7 అంతస్తుల్లో నిర్మాణం, బిల్డప్ ఏరియా 20.32 లక్షల చదరపు అడుగులు ఎత్తు 55 మీటర్లు… ఎల్వన్గా నిలిచిన సంస్థకు ఎల్ఓఏ ఇచ్చేందుకు ఓకే చెప్పింది. అలాగే పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్సైపీబీ) 5వ సమావేశం నిర్ణయాలను ఆమోదించింది. రూ. 30, 667 కోట్ల పెట్టుబడులతో 16 సంస్థల ఏర్పాటుకు ఇటీవల ఎస్ఐపీబీలో నిర్ణయం తీసుకుంది. వీటి ద్వారా 32,133 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నిర్ణయానికి జెండా ఊపింది చంద్రబాబు కేబినేట్.
శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, గుంటూరు , చిత్తూరు, కడప, అనంతపురం ఉమ్మడి జిల్లాలో సీనరేజీ ఫీజు వసూలు కాంట్రాక్టు గడువు పెంచే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశాఖ ఐటీ హిల్స్లో టీసీఎస్కు 21.66 ఎకరాల భూమిని రూ. 99 పైసలకు లీజు ఇచ్చేందుకు కేబినేట్ సూత్రప్రాయంగా ఓకే అంది. టీసీఎస్ ఏర్పాటు ద్వారా రూ.1370 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు రావటంతో పాటు 12 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు విశాఖ ఐటీ హిల్లో 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 56 ఎకరాల కేటాయించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థ ఏర్పాటుపై కేబినెట్ లో చర్చించారు.. 3 జిల్లాల్లో 199 వ్యవసాయ ఫీడర్ల ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్లకు ఆమోదం తెలిపింది. వివిధ ప్రాంతాల్లో సౌర, పవన, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు 6.35 ఎకరాల భూమి కేటాయించనుంది. కుప్పంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వ భూ మార్పిడికి ఆమోదం తెలిపింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు ఏపీఐఐసీకి భూ కేటాయింపులకు చంద్రబాబు కేబినెట్ ఓకే అంది..
పవన్ కు అస్వస్థత..
ఇవాళ ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పవన్ మంత్రివర్గ సమావేశానికి వచ్చారు. అయితే, కేబినెట్ భేటీ ప్రారంభానికి ముందే ఆయన అస్వస్థతకు గురయ్యారు.. ఆయన వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. దాంతో ఆరోగ్యం సహకరించక సమావేశం ప్రారంభమయ్యేలోపే అక్కడి నుంచి క్యాంపు ఆఫీస్కి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన క్యాంపు కార్యాలయంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.