AP | మరో హామీని అమలు చేసిన కూటమి సర్కార్
హత్యకు గురైన తహశీల్దార్ సతీమణికి డిప్యూటీ తహశీల్దార్ గా పోస్టింగ్
అమరావతి : ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. విశాఖపట్నానికి చెందిన తహసీల్దార్ రమణయ్య గత ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో రమణయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని, ఆయన కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఎన్నికల ముందు ప్రస్తుత రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ హత్యకు గురైన రమణయ్య భార్య అనూషను డిప్యూటీ తహసీల్దార్గా నియామిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేడు పోస్టింగ్ ఆర్డర్స్ ను అచ్చెన్నాయుడు రమణయ్య భార్య అనూషకు అందజేశారు. కారుణ్య నియామకంలో భాగంగా డిప్యూటీ తహసీల్దార్గా నియమించేందుకు మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా కృషి చేసి తమను ఆదుకుని, న్యాయం చేసినందుకు మంత్రి అచ్చెన్నాయుడుకు, ప్రభుత్వానికి డిప్యూటీ తహసీల్దార్ అనూష కృతజ్ఞతలు తెలిపారు.