AI | త్వరలో ఏఐతో ప్రాపర్టీ ట్యాక్స చెల్లింపులు…

AI | త్వరలో ఏఐతో ప్రాపర్టీ ట్యాక్స చెల్లింపులు…
- ఆస్తిపన్ను చెల్లింపులకు సరికొత్త విధానం
- ఏఐ ద్వారా చెల్లింపులు చేసేలా బల్దియా సన్నాహాలు
- ఇందులో పారదర్శకతతో పాటు ఉండని సిబ్బంది ప్రమేయం
- అన్ని పన్నుల వలే ఆన్లైన్ ద్వారా బాధ్యతగా చెల్లించేలా
- చెల్లించాల్సిన పన్నులను కేవలం ఫాలోఅప్ మాత్రమే చేసుకోనున్న బల్దియా
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆంధ్రప్రభ : ఇన్కంట్యాక్స్, కరెంట్ బిల్లు, ఇతర బిల్లులు కట్టాల్సిన సమయానికే ప్రజలు ఎలా కడుతున్నారో అలానే ఆస్తిపన్ను కూడా ఆన్లైన్ ద్వారా కట్టే వెసలుబాటు కల్పించనుంది జీహెచ్ఎంసీ. ఇందుకు అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ విదానాన్ని అందుబాటులోకి తీసుకు రాబోతున్నారు అధికారులు. ఇక సిబ్బంది పన్ను చెల్లించాల్సిన వారి వెంటబడకుండా, నోటీసుల ప్రమేయం లేకుండా చూడడంతో సమయం కలసిరావడంతో పాటు అనవసరమైన ఒత్తిడిని సిబ్బంది, అధికారులపై పెట్టకుండా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 15.50 లక్షల ఆస్తులకు చెందిన యజమానులు ప్రాపర్టీ ట్యాక్స్ చెలిస్తుండగా, వీటిలో రెండు లక్షల వరకు కమర్షియల్ ప్రాపర్టీలున్నట్లు జీహెచ్ఎంసీ వద్దనున్న రికార్డులు చెబుతున్నాయి. అయితే ఈ కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు అమలు చేస్తున్న బెంచ్ మార్క్ ప్రాపర్టీ ట్యాక్స్ విధానం కింద దశాబ్దాల కాలం నుంచి పైసా పన్ను పెంచకుండా జీహెచ్ఎంసీ ట్యాక్స్ స్టాఫ్ తో పన్ను కలెక్షన్ చేసుకుంటుంది. ఏటా రూ. వంద కోట్ల నుంచి రూ. 150 కోట్ల పెంచుకుంటూ గత ఆర్థిక సంవత్సరం (2024-25) లో రూ. 2038 కోట్ల రికార్డు స్థాయి కలెక్షన్ చేసుకుంది.
అన్నీ ఆన్లైన్ ఉన్నప్పుడు.. ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపా…
ఇక కరెంటు, వాటర్ బిల్లులతో పాటు ఆదాయ పన్ను చెల్లించటంలో చూపే ఆసక్తి, శ్రద్ధను గ్రేటర్ హైదరాబాద్ వాసులు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించటంలో చూపటం లేదన్న విషయాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు ఆర్టీపీషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించి ట్యాక్స్ సిబ్బంది ప్రమేయం లేకుండానే, నేరుగా ప్రాపర్టీ ఓనర్ ఆన్ లైన్ లో చెల్లించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ముఖ్యంగా ప్రస్తు ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఇప్పటి వరకు సుమారు రూ. 1430 కోట్ల మేరకు పన్ను వసూలైనట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది ఇదే తేదీ వరకు అయిన ట్యాక్స్ కలెక్షన్ తో పోల్చితే రూ. వంద కోట్లు అధికంగా కలెక్షన్ చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ లో జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ వివరాలు అందుబాటులో ఉన్నా, వాటిని చెక్ చేసుకుని పన్ను చెల్లించే యజమానులు అంతంతమ్రాతంగానే ఉన్నారు. దశాబ్దాల క్రితం నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ పైసా పెంచలేదు.
ఉన్న ప్రాపర్టీలు కనీసం యూసేజీకి తగిన విధంగా పన్ను చెల్లిస్తున్నాయా? లేదా? ప్రస్తుతం ఆ నిర్మాణాలు ఎలా ఉన్నాయి? తీసుకున్న అనుమతులను ఉల్లంఘించి అదనంగా అంతస్తులేమైనా వచ్చాయా? వినియోగం రెసిడెన్షియలా? కమర్షియలా? అన్న విషయాలను ఫీల్డు లెవెల్ లో టెక్నికల్ గా తెల్సుకునేందుకు గత సంవత్సం జూలై మాసం నుంచి అధికారులు సిటీలోని ప్రాపర్టీలపై జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే (జీఐఎస్)ను నిర్వహిస్తున్నారు.
ఇందుకు సంబంధించి ప్రస్తుతం తుది దశలోనున్న జీఐఎస్ సర్వే లో సేకరించిన డేటా బేస్ మొత్తాన్ని ఏఐకి లింక్ చేయనున్నట్లు తెలిసింది. ప్రాపర్టీలో అదనపు అంతస్తులు వచ్చినా, యూసేజీ మారినా, రెసిడెన్షియల్ ప్రాపర్టీకి కమర్షియల్ కరెంట్ మీటర్లు వినియోగించినా, ఆ విజువల్స్ అన్ని యజమానికి అందుబాటులోకి వచ్చి, పెరిగిన ప్రాపర్టీ ట్యాక్స్ కు సంబంధించి ఎలాంటి అనుమనాల్లేకుండా ఆధారాలతో అందుబాటులోకి తెచ్చే దిశగా జీహెచ్ఎంసీ కసరత్తు కొనసాగుతుంది.
ఇప్పటి వరకు సుమారు 12 లక్షల ఆస్తులపై ఈ సర్వే ముగిసిన, ఇపుడు తుది దశలో ఉంది. ఈ సర్వేలో సేకరించిన సమాచానాన్ని విజువల్స్ తో యజమానికి అందుబాటులో ఉంచి, ఆదాయ పన్ను మాదిరిగానే ప్రతి ఏటా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించేలా రిమైండర్లు ఇచ్చేలా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించనున్నారు. యజమానికి తన ఆస్తికి సంబంధించిన వివరాలు, విజువల్స్ తో పాటు చెల్లించాల్సిన పన్ను, తేదీలకు సంబంధించి అలర్ట్ లు ఇచ్చేలా ఈ ఏఐను వినియోగించాలని భావిస్తున్నారు.
