పెద్దపులికి సేఫ్ జోన్ – టైగర్ జోన్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ
టైగర్ కన్జర్వేషన్గా కొమురం భీం, కాగజ్నగర్
జీవో నెంబర్ 49 రిలీజ్ చేసిన ప్రభుత్వం
అడవుల్లోకి వెళ్లడానికి ప్రజలకు ఇక ఆంక్షలు
మూడు రాష్ట్రాల సరిహద్దులకు టైగర్ రిజర్వ్ విస్తరణ
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ :
పెద్ద పులుల మనుగడ, సంరక్షణకు అనేక సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కొమరం భీం, ఆసిఫాబాద్ డివిజన్లను టైగర్ కన్జర్వేషన్ జోన్గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల ఆవాసంగా ఉన్న ప్రధానమైన పెద్ద పులుల కారిడార్ ను కన్జర్వేషన్ రిజర్వుగా గుర్తిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 49 జారీ చేసింది. కొమరం భీం జిల్లాలోని ఈ రెండు అటవీ డివిజన్ లు ఇప్పటివరకు కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోనే కొనసాగుతోంది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని కొమరం భీమ్ జిల్లాలోని ఈ రెండు డివిజన్ల అటవీ విస్తీర్ణం పరిధి 1,49,288.88 హెక్టార్లుగా విస్తరించి ఉంది. కొత్తగా ప్రభుత్వం ఆమోదించిన కన్జర్వేషన్ రిజర్వ్ అటవీ ప్రాంతం 1492.88 చదరపు హెక్టార్ల పరిధి గా విస్తరించింది. 78 రిజర్వ్ ఫారెస్ట్ బ్లాకు లుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పెద్ద పులుల ఆవాసానికి అనువైన స్థలంగా…
పెద్దపులుల ఆవాసానికి అనువైన కాగజ్ నగర్ డివిజన్ లోని కదంబ, బెజ్జూర్, గార్లపెట్ ముఖ్యమైన కేంద్రాలుగా గుర్తించారు. కన్జర్వేషన్ రిజర్వ్ గా ప్రభుత్వం గుర్తించడంతో ఆసిఫాబాద్ డివిజన్ లోని ఆసిఫాబాద్, తీర్యాని, రెబ్బెన, కెరమెరి అటవీ రేంజ్ పరిధి, కాగజ్ నగర్ డివిజన్ లోని కాగజ్ నగర్, సిర్పూర్ టి, బెజ్జూర్, పెంచికల్పేట్, కార్జెల్లి రేంజ్ పరిధిలో పులులు వన్యప్రాణుల సంరక్షణకు ఇక పకడ్బందీ చర్యలు చేపట్టనున్నారు.
మూడు రాష్ట్రాల సరిహద్దులకు టైగర్ రిజర్వ్ విస్తరణ
కొమురం భీం జిల్లాలోని రెండు డివిజన్ లు టైగర్ రిజర్వు కన్జర్వేషన్ పరిధిలోకి రావడంతో మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని తడోబా, అందేరి, ఇంద్రావతి, ఛత్తీస్గఢ్ టైగర్ జోన్ కారిడార్ మరింత వైశాల్యంతో విస్తరించనుంది. మూడు రాష్ట్రాల సరిహద్దులను అనుసంధానం చేస్తూ పెద్దపులలో సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.
ఏజెన్సీలో ఆంక్షలు కఠినతరం
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో ఇప్పటికే ఆంక్షలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తుండగా, కొమురం భీం టైగర్ కన్జర్వేషన్ ఏర్పాటు వల్ల వందలాది పల్లెల్లో, అటవీ శివారు గూడెల్లో భయభ్రాంతులకు గురవుతున్నారు. అడవుల్లోకి వెళ్లకుండా నిషేధిస్తూ అటవీశాఖ ఆంక్షలు విధించే అవకాశం ఏర్పడింది. పంటచేలకు, వంట సరుకు కోసం అడవికి వెళ్లాలన్నా అధికారుల అనుమతి తప్పనిసరిగా మారింది. పంట చేనుకు కంచె వేసినా, పూరిగుడిసెకు పొరక తెచ్చినా ఇబ్బందులు తప్పవని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికే వన్యప్రాణులను హత మారుస్తున్నారని, పంట చేనుకు కంచి ఏర్పాటు చేస్తున్నారని, పోడు భూముల్లో సాగు చేస్తున్నారని అటవీ సిబ్బంది వేధింపులకు గురి చేయడమే గాక కేసులు నమోదు చేస్తున్నట్టు ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల పరిధిలో మానవ రాకపోకలు, సంబంధాలపై ఆంక్షలు విధించి గ్రామాలను కూడా తరలించే అవకాశం లేకపోలేదని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం వన్యప్రాణుల భద్రత సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన కన్జర్వేషన్ రిజర్వ్ ఉత్తర్వులను విరమించుకోవాలని, అటవీ ప్రాంత ప్రజలపై ఆంక్షలు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.