Achievement | తెలంగాణ‌కు బీవైడీ – బీఆర్ఎస్ ప్ర‌భుత్వ కృషి ఫ‌లిత‌మే

హైదరాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : రాష్ట్రానికి బీవైడీ కార్ల సంస్థ పెట్టుబడి రావడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ హ‌ర్షం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రానికి బీవైడీ సంస్థ వచ్చిందన్నారు. 2023లోనే 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడికి బీవైడీ, ఒలెక్ట్రా అంగీకారం కుదుర్చుకున్నాయని గుర్తు చేశారు. బీవైడీ కంపెనీ రాష్ట్రానికి రావడం ఫార్ములా-ఈ రేసు ప్రత్యక్షఫలితమని వెల్లడించారు. బీవైడీ రాకకు ఏళ్ల‌ తరబడి కష్టపడిన అందరికి ఎక్స్‌ వేదికగా అభినందనలు తెలిపారు.

బీఆర్ఎస్ ప్ర‌భుత్వ కృషి ఫ‌లితంగా…
‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కృషితోనే తెలంగాణకు బీవైడీ సంస్థ వచ్చింది. నాడు బీఆర్‌ఎస్‌ చేసిన కృషి.. నేడు ఫలితించింది. దిగ్గజ కంపెనీ భారీ పెట్టుబడితో యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి. ఫార్ములా-ఈ రేసు నిర్వహణతో ప్రపంచం దృష్టిని తెలంగాణ ఆకర్షించింది. ప్రభుత్వాలు మంచి విధానాలు ప్రవేశపెడితే నీఛమైన రాజకీయాలను అధిగమించి మంచి ఫలితాలు వస్తాయి ’ అని కేటీఆర్ పోస్టు పెట్టారు. తాము ప్రవేశపెట్టిన తెలంగాణ మొబిలిటీ వ్యాలీ, ఈవీ విధానం వల్లే ఈ రోజు బీవైడీ తెలంగాణకు వచ్చింద‌న్నారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ, ఈవీ పాలసీ భాగంగానే ఫార్ములా-ఈ రేస్‌ను నిర్వహించామ‌ని, తమ విధానాల వల్లే తెలంగాణకు ఇంత భారీ పెట్టుబడి వచ్చింద‌ని, ఈ పెట్టుబడి కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనల‌ను ఆయ‌న తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *