Accident|మహాకుంభమేళాకు వెళుతుంటే 10 మందిని కాటేసిన మృత్యువు
ప్రయాగ రాజ్ : ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు – కారు ఒకదానికొకటి ఢీకున్నాయి. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రయాగ్ రాజ్- మీర్జాపుర్ నేషనల్ హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మహాకుంభమేళాకు వెళ్తున్న ట్రావెల్ బస్సును కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. గాయపడ్డవారిని అంబులెన్స్ ల ద్వారా సమీప ఆస్పత్రికి తరలించారు.
మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించేందుకు ఛత్తీస్ ఘడ్ లోని కోర్బా జిల్లా నుంచి భక్తులు కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ జిల్లాకు చెందిన భక్తులు బస్సులో వస్తుండగా ఒకదానికొకటి ఢీ కొన్నాయని పేర్కొన్నారు.
ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
కొన్ని రోజుల క్రితం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించి వస్తున్న ఏపీకి చెందిన మిని బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో హైదరాబాద్ కు చెందిన ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.