Accident | పాస్టర్ మృతి…. రాజమండ్రిలో అలజడి

ఇది ప్రమాదమేన‌న్న‌ పోలీసులు
చంపేశార‌ని క్రైస్తవ సంఘాల ఆరోపణ
రంగంలోకి అయిదు ప్రత్యేక బృందాలు
ద‌ర్యాప్తు వేగం పెంచిన‌ జిల్లా ఎస్పీ
సమగ్రంగా విచారణ‌కు హోంమంత్రి ఆదేశం
దిగ్భ్రంతి వ్య‌క్తం చేసిన‌ మంత్రి లోకేష్

రాజమండ్రి ప్రతినిధి, ఆంధ్రప్రభ :

హైదరాబాద్ కు చెందిన క్రైస్తవ ప్రసంగికుడు అనుమానాస్పద మృతిపై ఏపీ , తెలంగాణలో అలజడి రగిలింది. ఆయన ప్రమాదంలో చనిపోయాడని పోలీసులు ప్రాథమిక విచారణలో ప్రకటించగా.. కాదు ప్రత్యర్థులు హతమార్చారని క్రైస్తవ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, మంత్రి లోకేష్ స్పందించారు. ఘటనసపై సమగ్ర విచారణ జరపాలని సీఎం డీపీజీని ఆదేశించారు. ఈ కేసును పూర్తి సమాచారంతో దర్యాప్తు జరపాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని హోంమంత్రి అనిత ఆదేశించారు. ఈ మరణ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అసలు ఏం జరిగింది ?

తూ ర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గామన్‌ బ్రిడ్జి రహదారిపై కొంతమూరు నయారా పెట్రోల్‌ బంకు వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ పాస్టర్‌ మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాజానగరం సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్‌ తెలిపారు. హైదరాబాద్‌ తిరుమలగిరి సమీపంలోని ఎస్‌బీఎహెచ్‌ కాలనీకి చెందిన పగడాల ప్రవీణ్‌కుమార్‌(46) అంతర్జాతీయ క్రైస్తవ ప్రసంగికుడిగా ఉన్నారు. హైదరాబాద్‌ నుంచి బుల్లెట్‌పై వెనుక లగేజీ బ్యాగ్‌ కట్టుకుని రాజ మహేంద్రవరం బయలుదేరారు. రాజమహేంద్రవరంలో స్నేహితుడి ఇంటికి వెళ్తున్నానని, భార్యకు చెప్పి వెళ్లారు. ఈ క్రమంలో మార్గమధ్యలో సోమవారం అర్ధరాత్రి కొంతమూరు సమీపంలోని నయారా పెట్రోల్‌ బంకు వద్దకు వచ్చే సరికి మోటార్‌సైకిల్‌ అదుపుతప్పి రహదారి నుంచి పల్లపు ప్రాంతానికి పడిపోవడంతో ప్రవీణ్‌కుమార్‌పై మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మర్నాడు ఉదయం వరకు ఎవరూ గమనించలేదు. మంగళవారం ఉదయం అందిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు ప‌రిశీలించారు. సీసీ కెమెరా పుటేజీని పరిశీలించామని, బుల్లెట్‌తో సహా ప్రవీణ్‌కుమార్‌ రహదారి పైనుంచి కిందికి జారిపోవడం, బుల్లెట్‌ ఆయనపై పడిపోవడంతో మృతిచెందినట్టు తెలిపారు. ఈ మేరకు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేం ద్రవరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. ఎస్‌ఐ మనోహర్‌ కేసు నమోదు చేశారు.

రాజమండ్రిలో ఉద్రిక్తత

మరోవైపు రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద పాస్టర్లు, క్రైస్తవులు, దళిత సంఘాలు నిరసన చేప‌ట్టాయి. ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. పాస్టర్ల ఆందోళనలతో రాజమండ్రి ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆసుపత్రి వద్దకు భారీగా దళిత సంఘాలు,పాస్టర్లు, క్రైస్తవులు చేరుకున్నారు. దీంతో ఎలాంటి అవాంఛ‌నీయ‌ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. ప్రవీణ్ ఒంటిపై గాయాలున్నాయని… రాడ్డుతో కొట్టినట్టు కనిపిస్తోందని క్రైస్తవ సంఘాల నేతలు చెబుతున్నారు. రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో ప్రభుత్వాసుపత్రి ఎదురుగా ఉన్న ప్రాంతం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. రెండు, మూడు గంటలపాటు రోడ్డుపై ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడి ధర్నాను తాత్కాలికంగా విరమింప చేశారు. ఈ ఆందోళనలో మాజీ ఎంపీ హర్షకుమార్‌, రాజేష్‌ మహాసేనతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలు, రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ పాస్టర్లు జాన్‌ వెస్లీ, జేమ్స్‌, విజయరాజు వంటివారితోపాటు క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రంగంలో అయిదు ప్రత్యేక బృందాలు : ఎస్పీ

పాస్టర్‌ ప్రవీణ్‌ మృతి అనుమానాస్పదంగా ఉందన్న‌ ఆరోపణలతో విచారణకు అయిదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహకిషోర్‌ తెలిపారు. ప్రత్యేక పోలీస్‌ బృందాలు పారదర్శకంగా, ఎటువంటి డివియేషన్స్‌ లేకుండా కేసును సరైన పద్ధతిలో విచారణ చేస్తున్నాయన్నారు. ఇతరుల మనోభవాలు, మానాభిమానాలు దెబ్బతినేలా, కుల, మత రాజకీయవర్గాల మధ్య విద్వేషాలు రగిల్చేలా, మతపరమైన, సున్నిత అంశా ల్లో వదంతులు, అవాస్తవాలు ప్రచారం చేస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగించేలా సామాజిక మధ్యమాల్లో తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేసి ప్రజలను రెచ్చకొడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అన్ని కోణాల్లో విచారణ: సీఎం ఆదేశం

హైదరాబాద్‌కు చెందిన పాస్టర్ ప్రవీణ్ మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. పాస్టర్ మృతిపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆదేశించారు. ఈ విషయంపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో మాట్లాడారు. పాస్టర్ హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. సమగ్ర విచారణకు జరపాల్సిందిగా ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *