చెన్నై: తమిళనాడులో బుధవారం తెల్లవారుజామున కరూర్ జిల్లా కుళితలై హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అయిదుగురు సజీవదహనమయ్యారు.. ఈ రహదారిపై ప్రయాణిస్తున్న బస్సును ఎదురు నుంచి వస్తున్న కారు బలంగా ఢీకొంది. దీంతో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, కారు డ్రైవర్ సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం మృతదేహాలను కారులో నుంచి బయటకు తీశారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని చెప్పారు.
మృతులు కోయంబత్తూర్లోని కునియముత్తూరుకు చెందినవారిగా గుర్తించారు. ఒరతనాడులోని కీలైయూర్లో ఉన్న అగ్నివీరనార్ ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. అరంతంగి నుంచి తిరువూర్ వెళ్తున్న ప్రభుత్వ బస్సును కారు ఢీకొట్టిందన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.