కెనడా : కెనడాలో భారత్కు చెందిన విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పది రోజుల క్రితం కెనడాలో జరిగిన కాల్పుల్లో ఒంటారియోలోని హామిల్టన్లోని మోహాక్ కళాశాలలో చదువుతున్న హర్సిమ్రత్ రంధావా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా మరో భారతీయ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది.
హర్యానా రాష్ట్రానికి చెందిన వన్షిక.. పైచదువుల కోసం రెండేళ్ల కిందట కెనడాకు వెళ్లింది. అక్కడ స్థానికంగా ఉన్న కళాశాలలో చదువుకుంటోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 18న ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తవ్వడంతో ఒట్టావా లోనే ఓ పార్ట్టైమ్ జాబ్లో చేరింది. ఈ క్రమంలో ఈనెల 25న డ్యూటీ కోసం వెళ్లిన వన్షిక తిరిగి రాలేదు. రోజూ కుటుంబ సభ్యులు ఆమెతో ఫోన్లో మాట్లాడేవారు. అయితే 25వ తేదీ నుంచి ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అని వస్తోంది. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మూడు రోజులుగా వన్షిక కోసం తీవ్రంగా గాలించారు. ఈ క్రమంలో ఇవాళ బీచ్లో శవమై కనిపించింది. ఈ విషయాన్ని ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ ద్వారా వెల్లడించింది. వన్షిక.. పంజాబ్లోని ఆప్ నేత దేవిందర్ సింగ్ కుమార్తెగా అధికారులు గుర్తించారు.