TG | విధి వింత నాట‌కం.. మృతి చెందిన విద్యార్థినికి స్కూల్ ఫ‌స్ట్‌!

  • 510 మార్కులు తెచ్చుకున్న నాగ‌చైత‌న్య‌
  • ప‌ది రోజుల కింద‌ట చ‌నిపోయిన బాలిక‌


రాజ‌న్న సిరిసిల్ల జిల్లా, ఆంధ్ర‌ప్ర‌భ : ఆ విద్యార్థినితో విధి వింత నాట‌క‌మాడింది. ఆ విద్యార్థి బంగారు భ‌విష్య‌త్తుపై కుటుంబ స‌భ్యులు పెంచుకున్న ఆశ‌లు నెర‌వేరినా విధి మాత్రం ఆ కుటుంబం ప‌ట్ల క‌రుణ చూప‌లేదు. ప‌ది రోజుల కింద‌ట ఆ విద్యార్థిని అనారోగ్య కార‌ణంగా మ‌ర‌ణించింది. అయితే బుధ‌వారం విడుద‌ల అయిన టెన్త్ ఫ‌లితాలు చూసేస‌రికి ఆ విద్యార్థిని 510 మార్కులు తెచ్చుకుని స్కూల్ ఫ‌స్ట్‌గా నిలిచింది. అభినందిద్దాం అనుకునే ఉపాధ్యాయుల‌కు, తోటి విద్యార్థుల‌కు ఆ బాలిక అంద‌నంత దూరంలోకి వెళ్లిపోయింది.

మృతిచెందిన విద్యార్థినికి స్కూల్ ఫ‌స్ట్…
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిధిలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన ఆకుల నాగచైతన్య (15) అనే బాలిక అదే గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతుంది. టెన్త్ క్లాస్ ప‌రీక్ష‌లు కూడా రాసింది. ఆ బాలిక కుటుంబ స‌భ్యులు కూడా మంచి భ‌విష్య‌త్తు కోసం చ‌దువుకోవాల‌ని హిత‌బోధ చేసేవారు. అలాగే ప్రోత్స‌హించారు. ఇంకా టెన్త్ ఫ‌లితాలు రాకుండానే తీవ్ర అనారోగ్యంతో నాగ‌చైత‌న్య ఏప్రిల్ 17న ప్రాణాలు కోల్పోయింది.

మల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఫలితాలను చెక్ చేస్తుండగా.. చనిపోయిన నాగచైతన్య హాల్‌‌టికెట్ నెంబర్‌ను వెబ్ సైట్ చూడ‌గా.. 510 మార్కులతో ఏకంగా స్కూల్ ఫస్ట్ వచ్చింది. ఇదే విషయాన్ని ఉపాధ్యాయులు, బాలిక తల్లిదండ్రులకు తెలుపగా వారు పాఠశాల వద్దకు వచ్చి తమ కూతురుని తలుచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. వారి అరణ్య రోధన చూసిన అక్కడున్న వారు సైతం తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు.

Leave a Reply