TG | దివ్యాంగుడికి ఉపాధి క‌ల్పించిన ఎమ్మెల్సీ క‌విత

మ‌హ‌బూబాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వీరాభిమాని, దివ్యాంగుడైన చిర్రా సతీశ్‌ ఏర్పాటు చేసిన జిరాక్స్‌ సెంటర్‌ను ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. దివ్యాంగుడైన చిర్రా సతీష్‌కు క‌విత‌ ఆర్థికంగా చేయూతనందించారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం రామానుజాపురం వెళ్లిన ఆమె ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, తక్కలపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌తో కలిసి ప్రారంభించారు.

అడిగిన వెంటనే అభయం…
మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం రామానుజపురం గ్రామానికి చెందిన చిర్రా సతీశ్‌కు చిన్నప్పటి నుంచే కేసీఆర్‌ అంటే ఎంతో అభిమానం. 2001లో టీఆర్‌ఎస్‌ స్థాపించిన నాటి నుంచి కార్యకర్తగా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. అదే సమయంలో ఆర్థిక ఇబ్బందులు, అంగవైకల్యాన్ని ఎదిరించి ఆత్మస్థైర్యంతో డిగ్రీ పూర్తి చేశారు. ఫిబ్రవరి 17 కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా తనకు ల్యాప్‌టాప్‌, జిరాక్స్‌ మిషన్‌ కొనిపించి స్వయం ఉపాధికి తోడ్పాటు అందించాలని ఎమ్మెల్పీ కవితకు మెస్సేజ్‌ చేశారు. ఆమె వెంటనే స్పందించి అభయమిచ్చారు. వారం కూడా తిరగకముందే ఇంటర్నెట్‌, జిరాక్స్‌ సెంటర్‌కు కావాల్సిన పరికరాలను సమకూర్చారు. కాగా, ఈ ఇంటర్నెట్‌ సెంటర్‌కు తన అభిమాన నేత కేసీఆర్‌ పేరును సతీష్‌ పెట్టారు. పెద్ద మనస్సుతో సాయం చేసిన ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యకర్తలే పార్టీకి ఆయువుపట్టు..
ఇంటర్నెట్‌-జిరాక్స్‌ సెంటర్‌ ఏర్పాటుపై ఎక్స్‌ వేదికగా కవిత స్పందించారు. కార్యకర్తలే పార్టీకి ఆయువుపట్టని చెప్పారు. కార్యకర్తలకు అండగా ఉండడం కేసీఆర్ తమ‌కు నేర్పిన బాధ్యత అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, కేసీఆర్ వీరాభిమాని చిర్రా సతీష్‌కి స్వయం ఉపాధి కల్పించడం తన బాధ్యతగానే భావించానని తెలిపారు. కార్యకర్తలు, వారి కుటుంబాలకు అన్ని రకాల మద్దతు ఇవ్వడంలో ముందుండే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని వెల్లడించారు. సతీష్ ‘కేసీఆర్ ఇంటర్నెట్-జిరాక్స్’ సెంటర్ ను ప్రారంభించే అవకాశం త‌న‌కు కలగడం సంతోషంగా ఉందని ట్వీట్‌ చేశారు.

Leave a Reply