ordinary devotees | ఇంద్రకీలాద్రిపై…

ordinary devotees | ఇంద్రకీలాద్రిపై…
- సామాన్య భక్తులకు పెద్దపీట…
- వారాంతాలు, సెలవు దినాల్లో అంతరాలయ దర్శనానికి నిలుపుదల…
- రూ.500 ప్రత్యేక దర్శన టికెట్ల విక్రయం రద్దు…
- రద్దీ నివారణే లక్ష్యంగా చర్యలు..
- కీలక నిర్ణయం తీసుకున్న దేవస్థానం…
ordinary devotees | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి విచ్చేసే సామాన్య భక్తులకు మరింత త్వరితగతిన, సౌకర్యవంతంగా దర్శనం కల్పించాలనే లక్ష్యంతో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో భక్తుల రద్దీ గణనీయంగా పెరగడంతో, సామాన్య భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం అమలులోకి తీసుకువచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె.శీనానాయక్ తెలిపారు.
ordinary devotees | అంతరాలయ దర్శన వేళల్లో మార్పులు…

దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు, రద్దీని నియంత్రించి సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించేందుకు అంతరాలయ దర్శన విధానంలో మార్పులు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. ప్రతి శుక్ర, శని, ఆదివారాలతో పాటు పండగలు, పర్వదినాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అంతరాలయ దర్శనాన్ని పూర్తిగా నిలిపివేయనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే రూ.500 దర్శన టికెట్ల ఉత్రియాలు కూడా నిలుపుదల చేస్తామన్నారు.

ఈనిర్ణయం అమలులో ఉన్న రోజుల్లో రూ.500ల అంతరాలయ దర్శన టికెట్ల విక్రయం ఉండదని ఈవో తెలిపారు. ఆలయానికి లభించే టికెట్ ఆదాయాన్ని కూడా పక్కనపెట్టి, సామాన్య భక్తుల సంతృప్తి, సౌకర్యానికే అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక దర్శన టికెట్ల విక్రయాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు వివరించారు. ఇది భక్తుల పట్ల దేవస్థానం చూపుతున్న నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు.

సామాన్య భక్తుల సౌకర్యమే ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఈవో తెలిపారు. సామాన్య భక్తులు క్యూ లైన్లలో ఎక్కువసేపు నిలబడకుండా, వీలైనంత త్వరగా అమ్మవారి దర్శనం పొందాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈవో స్పష్టం చేశారు. రద్దీ సమయాల్లో ప్రత్యేక దర్శనాల వల్ల సామాన్య భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ordinary devotees | భక్తులకు దేవస్థానం విజ్ఞప్తి…

దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, స్థానిక ప్రజలు, అలాగే ప్రముఖులు (వీఐపీలు) ఈ మార్పులను గమనించి దేవస్థానానికి సహకరించాలని ఈవో విజ్ఞప్తి చేశారు. రద్దీ సమయాల్లో సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ అవగాహన చేసుకుని సహకరించాలని కోరారు.
