మహాశివరాత్రిని పురస్కరించుకుని మంగళవారం శ్రీశైల భ్రమరాంబికా, మల్లికార్జున స్వామి, అమ్మవార్లు గజవాహన సేవలో తరించనున్నారు. ఇక ఉదయం యాగశాల యందు శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపించారు. లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేశారు.
అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు శాస్త్రం ప్రకారంగా జరిపించడం విశేషం. ఇక ఈ సాయంకాలం ప్రదోష కాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిపించనున్నారు.
గజవాహన సేవ…
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి రాత్రి శ్రీస్వామి అమ్మవార్లకు గజవాహన సేవ జరిపించనుండగా, ఈ సేవలో శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో గజవాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు నిర్వహిస్తారు.
గ్రామోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజభటులవేషాలు, కేరళ చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంబాయ్ డోల్ థేష్, విళక్కు, స్వాగత నృత్యం, వీరభద్రడోలు కుణిత, జాంజ్ పథక్ ( కర్ణాటక డోలు) కాళికా నృత్యం, జానపద పగటి వేషాలు, నందికోలు సేవ, గొరవనృత్యం, తప్పెటచిందు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి, డోలు విన్యాసం, గిరిజన చెంచు నృత్యం తదితర కళారూపాలను గ్రామోత్సవంలో ఏర్పాటు చేయబడ్డాయి.