హైదరాబాద్ – కృష్ణా రివర్ మ్యానేజ్ మెంట్ బోర్డ్ మీటింగ్ ముగిసింది. ఈ సమావేశంలో ఏపీకి తక్షణమే నీటి విడుదలను ఆపాలని తెలంగాణ కోరింది. కేఆర్ఎంబీ ఆదేశాలతో ఇరు రాష్ట్రాల ఈఎన్ సీలు భేటీ అయ్యారు.
నీటి పంపకాలపై చర్చించారు. కేఆర్ఎంబీ మీటింగ్ లో సాగు, తాగు నీటి అవసరాలకు 116 టీఎంసీల నీటిని కేటాయించాలని తెలంగాణ కోరింది. అటు మార్చి నెలకు 18 టీఎంసీల నీటిని అడుగుతోంది ఏపీ. ఇప్పటికే 666 టీఎంసీలలో 639 టీఎంసీల నీటిని ఏపీ వాడుకుంది.
కేఆర్ఎంబీ ఛైర్మన్ అతుల్ జైన్ ఆధ్వర్యంలో ఆయన ఛాంబర్ లో సమావేశం జరిగింది. తెలంగాణ నుంచి ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్ హాజరయ్యారు. ఏపీ నుంచి ఈఎన్సీ వెంకటేశ్వర్లు అటెండ్ అయ్యారు. నీటి పంపకాలపై ప్రధానంగా చర్చించారు.
శ్రీ శైలం నుంచి ఎవరూ కూడా నీటిని తీసుకోకుండా ఆపేయాలని, ఉన్న నీరు అంతా తెలంగాణకు సంబంధించినది మాత్రమే ఉందని, ఏపీ నీరు తీసుకోకుండా చూడాలని తెలంగాణ కోరింది. సాగర్ నుంచి ఇప్పటికీ ఏపీ 10వేల క్యూసెక్కులను తరలిస్తోందని, దాన్ని ఆపేయాలని తెలంగాణ కోరింది.
అయితే.. సాగర్ కింద పంట పొలాలు ఉన్నాయని.. గుంటూరు ఆ ప్రాంతంలో పంట పొలాలు ఉన్నాయని, ఇప్పుడు నీరు ఆపితే ఎండిపోయే ప్రమాదం ఉందని, మానవతా కోణంలో చూడాలని ఏపీ నుంచి విజ్ఞప్తి వచ్చింది. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల ఈఎన్ సీలు కూర్చుని మాట్లాడుకోవాలని కేఆర్ఎంబీ ఛైర్మన్ సూచించారు.
ఆయన సూచన మేరకు ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు.. తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ ఛాంబర్ లో భేటీ అయ్యారు. కాగా, ఇన్ డెప్త్ గా డిస్కస్ చేసుకోవడానికి ఇరు రాష్ట్రాలకు చెందిన ఛీప్ ఇంజినీర్లు(సీఈలు) కూడా భేటీ కావాలని భావించారు. నాగార్జున సాగర్ నుంచి తాగు, సాగు నీటి అవసరాలపై డిస్కషన్ చేయనున్నారు. రేపు సీఈలు భేటీ అయ్యాక మరోసారి ఈఎన్సీలు భేటీ కావాలని నిర్ణయించారు.